సిటీబ్యూరో, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ) ; కొండపోచమ్మ సాగర్ నుంచి గండిపేటకు గోదావరి జలాలను తీసుకొస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. చారిత్రక మూసీ, ఈసీ నదిపై ప్యారిస్ తరహాలో రూ. 545 కోట్లతో 14 బ్రిడ్జిల నిర్మాణాలకు గానూ ఏడు చోట్ల బ్రిడ్జి పనులకు మంత్రి కేటీఆర్ సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మూసారంబాగ్, ఫతుల్లాగూడ వద్ద ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన మేరకు వచ్చే నెలాఖరుకల్లా 31 ఎస్టీపీలను అందుబాటులోకి తీసుకువచ్చి.. రోజుకు 200 కోట్ల లీటర్ల మురుగునీటిని శుద్ధి చేసి స్వచ్ఛమైన నీటిని మూసీలోకి వదలనున్నట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. 450 ఏండ్ల చరిత్ర ఉన్న మన నగరంలో ఫ్రాన్స్, గ్రీస్ దేశాల తరహాలో మూసీపై అత్యాధునిక శైలిలో వంతెనలు నిర్మించనున్నామని చెప్పారు. సినిమా షూటింగ్లు జరుపుకునే స్థాయిలో మంచి రేవుల నుంచి ఘట్కేసర్ వరకు మూసీనదిని సుందరీకరించి ఓ అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరిస్తామన్నారు. అలాగే హైదరాబాద్ అభివృద్ధికి రూ.5వేల కోట్లతో ఎస్ఎన్డీపీ, రూ. 4వేల కోట్లతో ఎస్ఆర్డీపీ రెండో దశ పనులు చేపట్టనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. –
హైదరాబాద్ను దేశంలోనే ఆదర్శనగరంగా, విశ్వనగరంగా చేయాలన్న సంకల్పం సీఎం కేసీఆర్కు ఉన్నదని, తొమ్మిదిన్నరేండ్లలో చేసిన నగరాభివృద్ధి కండ్ల ముందే కనిపిస్తున్నదని, పనిచేసే నాయకుడిని, ప్రభుత్వాన్ని ప్రోత్సహించాలని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రజలను కోరారు. సోమవారం పలు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి కేటీఆర్.. ఏడు చోట్ల మూసీపై వంతెనల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఎల్బీనగర్ కామినేని చౌరస్తాలోని ఫైఓవర్ బ్రిడ్జి కింద రూ. 50 లక్షలతో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ పార్కును పరిశీలించారు. అలాగే దుర్గం చెరువు వద్ద నిర్మించిన ఎస్టీపీని, మ్యూజికల్ ఫౌంటెయిన్ల మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, డిప్యూటీ మేయర్ శ్రీలతాశోభన్రెడ్డి, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, దేవిరెడ్డి సుధీర్రెడ్డి, బలాల, గాంధీ, ఎమ్మెల్సీలు యెగ్గె మల్లేశం, వాణిదేవి,బొగ్గారపు దయానంద్ గుప్తా, బల్దియా కమిషనర్ రోనాల్డ్రాస్,
హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్కుమార్, జలమండలి ఎండీ దానకిశోర్, జోనల్ కమిషనర్ పంకజ, టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్గుప్తా పాల్గొన్నారు.
దుర్గంలో మ్యూజికల్ ఫౌంటెయిన్లు
హుస్సేన్సాగర్ తరహాలో ఐటీ కారిడార్లోని దుర్గం చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మాదాపూర్, జూబ్లీహిల్స్, రాయదుర్గం కొండల ఉన్న దుర్గం చెరువును సరికొత్త హాట్స్పాట్గా మార్చేందుకు జీహెచ్ఎంసీతో పాటు హెచ్ఎండీఏ ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తూ చెరువు చుట్టూ ఉన్న తీర ప్రాంతాన్ని సుందరీకరణ చేపట్టారు. తాజాగా పర్యాటకులను మరింత అలరించేలా రెండు మ్యూజికల్ ఫ్లోటింగ్ ఫౌంటైయిన్లను హెచ్ఎండీఏ ఏర్పాటు చేయగా, వీటిని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ, ఎమ్మెల్సీ వాణిదేవి, హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్కుమార్, హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బి.ఎల్.ఎన్.రెడ్డి, అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ డాక్టర్ ప్రభాకర్లతో కలిసి ప్రారంభించారు. 40 మీటర్ల పొడవు, 10 మీటర్ల వ్యాసం కలిగిన రెండు మ్యూజికల్ ఫ్లోటింగ్ ఫౌంటైయిన్లను కేబుల్ బ్రిడ్జి రెండు వైపులా ఏర్పాటు చేసినట్లు హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. అలాగే దుర్గం చెరువు వద్ద 7 ఎంఎల్డీల సామర్థ్యంతో నిర్మించిన ఎస్టీపీని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ, ఎమ్మెల్సీ వాణిదేవి, హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్కుమార్తో కలిసి నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రారంభించారు.
ఆక్సిజన్ పార్కు అద్భుతం
కామినేని ఫ్లైఓవర్ కింద నిర్మించిన ఆక్సిజన్ పార్కును సోమవారం మంత్రి కేటీఆర్ పరిశీలించారు. ఈ పార్కులో ఆక్సిజన్ విడుదల చేసే 57 రకాలకు చెందిన 30 వేల మొక్కలను నాటారు. శిల్పాలు, మొక్కలు, వాకింగ్ ట్రాక్, సీనియర్ సిటీజన్స్ కోసం ఏర్పాటు చేసిన సిట్టింగ్లు వంటివి పరిశీలించిన మంత్రి కేటీఆర్ పార్కు అద్భుతంగా ఉన్నదని కితాబిచ్చారు. ఎమ్మెల్యే సుధీర్రెడ్డిని అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్కు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి ఆక్సిజన్ పార్కులోని విశేషాలను వివరించారు.
“హైదరాబాద్ మహానగరానికి మూసీ గొప్ప పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చింది. అలాంటి చారిత్రక నదిని గత ప్రభుత్వాలు పట్టించుకోక మూసీని మురికికూపంగా మార్చాయి. తెలంగాణ ప్రభుత్వం మూసీని పరిరక్షించి, సుందరీకరణకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. మూసీ నదిపై ఆధునిక బ్రిడ్జిలతో మరో ముందడుగు వేస్తున్నది. వచ్చే నెలాఖరుకల్లా మొత్తం 31 ఎస్టీపీలను అందుబాటులోకి తీసుకొస్తాం. రోజుకు 200 కోట్ల లీటర్ల మురుగునీటిని శుద్ధి చేసి స్వచ్ఛమైన నీటిని మూసీలోకి వదులుతాం”.