సిటీబ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయిందని, అన్ని వర్గాల ప్రజలను దారుణంగా వంచించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఈనెల 18న సరూర్నగర్లో నిర్వహించనున్న యువ సంగ్రామ సభకు సంబంధించి నగర బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులతో ఎమ్మెల్యే సుధీర్రెడ్డి నివాసంలో గురువారం కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. సభ ఏర్పాట్లు, నిర్వహణపై పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులతో విస్తృతంగా చర్చించారు. ‘యూత్ డిక్లరేషన్’ పేరిట కాంగ్రెస్ పార్టీ యువతను మోసం చేసిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. సభ ద్వారా కాంగ్రెస్ నయవంచనను ఎండగడుతామన్నారు.
ఈ సభ నిరుద్యోగులు, విద్యార్థుల గొంతుకగా నిలుస్తుందన్నారు. సభకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించాలని చూసినా వాటిని ఎదుర్కొని సభ జరిపించి తీరుతామన్నారు. హైదరాబాద్తో పాటు పరిసర అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కూడా భారీ సంఖ్యలో యువత స్వచ్ఛందంగా సభకు తరలివచ్చే అవకాశం ఉందని పార్టీ సీనియర్ నాయకులు కేటీఆర్కు వివరించారు. మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్, సబితాఇంద్రా రెడ్డి, మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కృష్ణారావు, కాలేరు వెంకటేశ్, లక్ష్మారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, నవీన్ రెడ్డి, సీనియర్ నేతలు రాగిడి లక్ష్మారెడ్డి, ఆజం ఆలీ, కార్తీక్ రెడ్డి, బంటి, ముఠా జయసింహ తదితరులు పాల్గొన్నారు.