మేడ్చల్, జనవరి 21(నమస్తే తెలంగాణ): దేశంలో అతిపెద్ద మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ వ్యూహ రచనతో ముందుకెళ్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రేటర్లో చేసిన అభివృద్ధి పనులు చూసి.. ప్రజలు మల్కాజిగిరి పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులకు పట్టం కట్టారు. ఈ నేపథ్యంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోనూ సత్తాచాటేందుకు సమాయత్తమవుతున్నారు. ఇందులోభాగంగా ఆదివారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో మల్కాజిగిరి పార్లమెంట్, నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ అధ్యక్షులు, ముఖ్యనాయకులు, ప్రజాప్రతినిధులతో సన్నాహక సమావేశం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల కార్యాచరణ, గెలుపు వ్యూహలపై చర్చించి సమావేశానికి హాజరైన వారి నుంచి అభిప్రాయలు సేకరించారు.
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ‘మల్కాజిగిరిలో బీఆర్ఎస్ జెండా ఎగిరేలా అందరం కష్టపడుదాం.. సత్తాచాటుదాం.. తెలంగాణ ఏకైక గొంతుక బీఆర్ఎస్సే.. పార్లమెంట్లో తెలంగాణ సమస్యలపై పోరాడిన చరిత్ర బీఆర్ఎస్దే.. పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఢిల్లీలో తెలంగాణ గొంతుక వినబడాలంటే బీఆర్ఎస్సే గెలవాలనే లక్ష్యంతో పనిచేసి మల్కాజిగిరి లోక్సభ స్థానాన్ని భారీ మెజార్టీతో గెలుచుకొని.. చరిత్ర సృష్టిద్దాం’ అని కేటీఆర్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. చేసిన అభివృద్ధే గెలుపునకు నాంది అని.. లోక్సభ ఎన్నికల్లో మల్కాజిగిరిలో విజయం బీఆర్ఎస్దేనని ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. గెలుపే లక్ష్యంగా సమష్టిగా పనిచేసి గులాబీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు.