కంటోన్మెంట్, జూన్ 6: కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ మన్నె క్రిశాంక్ అన్నారు. కేంద్రం నుంచి బోర్డుకు నిధులు రావాల్సి ఉన్నా.. విడుదల చేయకపోవడంతో అభివృద్ధి విషయంలో వెనుకబడి ఉందన్నారు. ఈ క్రమంలో మంగళవారం బోర్డు కార్యాలయంలో సీఈఓ మధుకర్నాయక్తో మన్నె క్రిశాంక్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఈ నెల 9న మడ్ఫోర్డ్లోని ప్రభుత్వ పాఠశాల ఎదురుగా ఉన్న ప్రదేశంలో ‘జాబ్మేళా’కు రావాలని సీఈఓకు ఆహ్వానం అందించారు. దీనికి సానుకూలంగా స్పందించిన సీఈఓ మధుకర్నాయక్ తప్పకుండా వస్తానని చెప్పారు. అనంతరం మన్నె క్రిశాంక్ కంటోన్మెంట్లో నెలకొన్న సమస్యలతో పాటు పలు అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు.
కేంద్రం నుంచి బోర్డుకు రావాల్సిన సర్వీస్ చార్జీల బకాయిలను విడుదల చేయించాలని కోరారు. కేంద్ర సర్కారు కంటోన్మెంట్ ప్రాంతాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగా కుట్రపూరితంగా వ్యవహరిస్తుందన్నారు. ఎన్నికలు నిర్వహించకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుందని విమర్శించారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో జీహెచ్ఎంసీలో మాదిరిగానే సర్కారు సంక్షేమ పథకాలు కంటోన్మెంట్లో అమలవుతున్నాయని తెలిపారు. యువతకు ఉపాధిని కల్పించే దిశగా ఈ నెల 9న నిర్వహిస్తున్న జాబ్మేళాలో సుమారు 5వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు చెప్పారు. రానున్న రోజుల్లో మహిళలకు ప్రత్యేకంగా ఉపాధికల్పించే విధంగా చర్యలు తీసుకోబోతున్నట్లు తెలిపారు. ఈ మెగా జాబ్మేళాకు 45 కంపెనీలకు పైగా పాల్గొంటున్నాయని, దీనిని కంటోన్మెంట్ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.