వర్సిటీలో కొత్తగా ఇంజినీరింగ్, లా, ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులు
మహిళా యూనివర్సిటీలో 354 టీచింగ్ పోస్టుల భర్తీకి సన్నాహాలు
1125 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకీ ప్రతిపాదనలు
త్వరలోనే యూనివర్సిటీ పాలక మండలి ఏర్పాటుకు చర్యలు
సిటీబ్యూరో, మే 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన మహిళా యూనివర్సిటీ (కోఠి ఉమెన్స్ కాలేజీ)లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి చర్యలు మొదలుపెట్టారు. ఓయూ, కేయూ, జేఎన్టీయూ వంటి యూనివర్సిటీల ఉన్న పోస్టులతో పాటు భర్తీ చేయాలా లేదా ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలా అన్న అంశంపై ఉన్నత విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆలోచన చేస్తున్నారు. కోఠి ఉమెన్స్ కాలేజీను మహిళా యూనివర్సిటీగా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోక ముందు నాటికి ఇందులో 354 టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 354 పోస్టులలో 55 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు, 273 అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయని మహిళా యూనివర్సిటీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ విద్యుల్లత తెలిపారు. అయితే వాటిలో 126 రెగ్యులర్ పోస్టులు, 147 కాంట్రాక్టు పద్ధతిలో పోస్టులు భర్తీ చేయడం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని చెప్పారు.
త్వరలో 1,125 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ..
కోఠి ఉమెన్స్ కాలేజీ మహిళా యూనివర్సిటీగా మార్పు చెందిన తర్వాత పోస్టుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా యూనివర్సిటీ హోదా ప్రకారం అదనపు పోస్టుల అవసరం పడుతుంది. అయితే దానిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం యూనివర్సిటీలో మొత్తం 1,125 నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో ఔట్ సోర్సింగ్ పోస్టులు 250 వరకు ఉన్నట్లు యూనివర్సిటీ ప్రిన్సిపల్ తెలిపారు. యూనివర్సిటీ ఏర్పాటు తర్వాత కొత్త కోర్సులు, విద్యార్థుల సంఖ్యను బట్టి అకాడమిక్ బ్లాకులు నిర్మించాల్సిన అవసరం ఉంది. అలాగే కొత్త హాస్టళ్ల నిర్మాణం చేయాలని అధికారులు భావిస్తున్నారు. అందులో భాగంగా హాస్టల్ వార్డెన్లు, వంటమనుషులు, సహాయకులు వంటి పలు రకాల పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటుందని వర్సిటీ అధికారులు తెలిపారు.
ఫ్యాషన్ టెక్నాలజీ, ఇంజినీరింగ్, లా కోర్సులపై దృష్టి..
మహిళా యూనివర్సిటీలో 2022-23 విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. విద్యా బోధన యూనివర్సిటీలో ప్రారంభించాలని ఇప్పటికే గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ప్రకటించారు. దీని ప్రకారం బీఏ, బీకామ్, బీఎస్సీతో డిగ్రీ, పీజీ కోర్సులతో పాటు కొత్తగా విద్యార్థినుల కోసం ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులను కొత్తగా అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు ఆ యూనివర్సిటీ అధికారులు చేస్తున్నారు. అలాగే వీలైతే వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఇంజినీరింగ్, లా వంటి కోర్సులను కూడా అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తామని, అందుకోసం ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం లభించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రిన్సిపల్ అభిప్రాయపడ్డారు.