Koti Womens College | సుల్తాన్బజార్, ఫిబ్రవరి 3: కళాశాలలో సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పీజీ విద్యార్థినులు ఆందోళన బాట పట్టారు. ఈ మేరకు శనివారం కోఠి చౌరస్తాలోని తెలంగాణ మహిళా విశ్వ విద్యాలయం ప్రధాన ద్వారం ఎదుట పీజీ విద్యార్థినులు బైఠాయించి తమ సమస్యలను పరిష్కరించాలని, పెంచిన ఫీజులను వెంటనే తగ్గించాలని నిరసన వ్యక్తం చేశారు.
కళాశాల యాజమాన్యం అటానమస్ సెమిస్టర్కు గతంలో రూ.3,500ల ఫీజు మాత్రమే ఉండేదని, ప్రస్తుతం ఆ ఫీజును రూ.5 వేలుగా నిర్ణయించడం పట్ల పేద విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన ఫీజులను తగ్గించాలని, హాస్టల్లో సరైన వసతులు కల్పించాలని కళాశాల ప్రిన్సిపాల్ను పలుమార్లు అడిగినా పట్టించుకున్న దాఖలాలు లేవని మండిపడ్డారు. ప్రధానంగా హాస్టల్లో మంచినీటి వసతి, మరుగుదొడ్లు శుభ్రంగా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పెంచిన ఫీజులను వెంటనే తగ్గించాలన్నారు.