అమీర్పేట్, ఫిబ్రవరి 27: బల్కంపేట ఎల్లమ్మ ఆలయ సిబ్బందిపై మంత్రి వేటు వేశారు. శుక్రవారం మ్రంతి కొండా సురేఖ బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో ఆకస్మిక తనిఖీ చేశారు. పరిపాలనా వ్యవహారాలకు సంబంధించి అంశాల్లో లోపించిన స్పష్టతపై ఆమె అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవ వివరాలకు, అధికారులు చూపుతున్న వివరాలకు మధ్య వ్యత్యాసం ఉండటంతో వెంటనే ఫైళ్లు స్వాధీనం చేసుకుని, అల్మారాలకు సీల్ వేయాలని దేవాదాయ శాఖ ఆర్జేసీ శ్రీనివాస్రావును ఆదేశించారు.
ఉద్యోగుల హాజరు పట్టిక కూడా అస్తవ్యస్తంగా మారిందని, మొత్తంగా దేవాలయ పరిపాలనా వ్యవస్థ గాడి తప్పిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ కంప్యూటర్ ఆపరేటర్ సహా, ముగ్గురు ఔట్సోర్సింగ్ ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తున్నట్టు పేర్కొన్నారు. దేవాలయం బయట ఉన్న షెడ్డును వెంటనే తొలగించాలని, ఎల్లమ్మ ఆలయానికి దాతగా వ్యవహారించిన దివంగత మాజీ సీఎం రోశయ్య పేరును పెట్టాలని సూచించారు.
అసంపూర్తిగా మిగిలిపోయిన పార్కింగ్ కాంప్లెక్స్ను సందర్శించిన మంత్రి సురేఖ అక్కడి నుంచే ఫోన్ ద్వారా డీఈతో మాట్లాడి వెంటనే కాంప్లెక్స్ నిర్మాణాలకు సంబంధించి పూర్తి నివేదికను పంపాలని ఆదేశించారు.
దేవాలయంలో చోటు చేసుకుంటున్న అవకతవకలపై టీపీసీసీ ఉపాధ్యక్షురాలు డాక్టర్ కోట నీలిమ మంత్రి సురేఖకు వివరించారు. ఆలయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కనీసం ఈఎస్ఐ, ఈపీఎఫ్ వంటి ప్రాథమిక సదుపాయాలను కల్పించడంలో ఆలయ అధికారులు ఘోర వైఫల్యం చెందారన్నారు. ఆలయానికి చెందిన ఆర్ధిక లావాదేవీలకు సంబంధించిన అంశాల్లో స్పష్టత లోపిస్తోందని, దాతలు సమర్పించుకున్న ఖరీదైన చీరలు కాంట్రాక్ట్ పాడుకున్న వ్యక్తులకు కాకుండా అధికారులు వాటిని స్వాధీనం చేసుకుంటున్నారనే ఫిర్యాదులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎల్లమ్మ దేవాలయ నిర్వహణలో అకౌంటెంట్, సూపరింటెండెంట్, ఈవోలు దారుణంగా విపలమయ్యారన్నారు.