Hyderabad | బడంగ్పేట, జూలై18: దాడి ఘటనలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మీర్పేట పరిధిలోని సర్వోదయ కాలనీలో నివాసముంటున్న కృష్ణ, నాగమ్మ దంపతుల కుమారుడు సాయి వరప్రసాద్ (22) డిగ్రీ వరకు చదువుకున్నాడు. ఇటీవలే పోలీస్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. సోమవారం రాత్రి సాయి వరప్రసాద్ తన స్నేహితులు భార్గవ్, ధనుష్తో కలిసి జిల్లెలగూడ లలితానగర్ చౌరస్తా నుంచి బీర్లు తీసుకొని వెళ్తుండగా.. నితీష్ గౌడ్, కిరణ్, మహేందర్రెడ్డి, మనోహర్, సురేశ్, వెంకటేశ్ అడ్డుకొని బీర్లు ఇవ్వమని అడిగారు. బీర్లు ఇవ్వకపోవడంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నితీష్ తన వద్దనున్న కత్తితో వరప్రసాద్పై దాడి చేశాడు. వరప్రసాద్ అక్కడే కుప్పకూలి పోయాడు. వెంటనే సమీపంలోనే ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ సమయానికి వైద్యులు లేకపోవడంతో ఒవైసీ హాస్పిటల్ తరలించారు. చికిత్స అందిస్తుండగా రాత్రి 11:33 గంటల సమయంలో వరప్రసాద్ మృతి చెందాడు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నితీష్, కిరణ్, మనోహర్, మహేందర్రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. సురేశ్, వెంకటేశ్ పరారీలో ఉన్నట్టు చెప్పారు.
వరప్రసాద్ హత్యకు గురికావడంతో అతడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషిస్తాడనుకుంటే ఇలా హత్యకు గురయ్యాడని తండ్రి కృష్ణ, తల్లి నాగమ్మ విలపించారు. తమ కొడుకును హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసు కొలువు వచ్చిందని సంబుర పడుతున్న సమయంలో ఇలా జరిగిందని రోదించారు.
సాయి వరప్రసాద్ హత్యకు నిరసనగా మృతుడి కుటుంబ సభ్యులు, ఎరుకల సంఘాలు నాయకులు స్వాగత్ హోటల్ వద్ద ఆందోళనకు దిగారు. వరప్రసాద్ను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని, అతడి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎరుకల హక్కుల సంక్షేమ సంఘం నాయకులు, మృతుడి కుటుంబసభ్యులు నిరసన చేపట్టారు. పోలీసులు, మృతుడి కుటుంబసభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జోక్యం చేసుకొని.. మృతుడి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అన్ని విధాలా న్యాయం జరిగేలా చూస్తామని చెప్పడంతో ఆందోళనను విరమించారు.