Amberpet | కేంద్రమంత్రి కిషన్రెడ్డికి అంబర్పేట నియోజకవర్గం రాజకీయ జీవితాన్ని ప్రసాదించింది. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించింది. తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన అంబర్పేట అభివృద్ధికి కిషన్రెడ్డి చేసింది శూన్యం. ప్రజలను ట్రాఫిక్ చిక్కులు, ముంపు సమస్యల్లోకి నెట్టేసి అన్నం పెట్టినోళ్లకు సున్నం పెట్టినంత పనిచేశారు. ఇక్కడి నుంచి పోటీ చేయడానికే జంకుతున్నారు.
కిషన్రెడ్డిని నమ్ముకుంటే తమ కష్టాలు తీరవని భావించిన అంబర్పేట ప్రజలు గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేశ్ను గెలిపించారు. తనపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని కాలేరు నిజం చేసి చూపించారు. ఐదేండ్లలోనే అబ్బురపడే రీతిలో అభివృద్ధి పనులు చేయించారు. అంబర్పేటకు కొత్త కళను తీసుకువచ్చారు.
అంబర్పేట నియోజకవర్గం గతంలో హిమాయత్నగర్లో కలిసి ఉండేది. ఇక్కడి నుంచి 2004లో, అంబర్పేట నియోజకవర్గంగా ఏర్పడ్డ తర్వాత 2009, 2014లో కిషన్రెడ్డి ఇక్కడి నుంచి విజయం సాధించారు. ఇప్పుడు ఆయన ఎంపీగా ఉన్న సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోకే అంబర్పేట కూడా వస్తుంది. అంటే, ఇక్కడి ప్రజలు ఆయనకు నాలుగుసార్లు ఓట్లేసి గెలిపించారు. ప్రజల ఓట్లతో కిషన్రెడ్డి రాజకీయంగా ఎదిగారు. కానీ, ఆయనకు ఓట్లేసిన ప్రజలకు మాత్రం ఒరిగిందేమీ లేదు. అంబర్పేటలో ఆయన చేసిన అభివృద్ధి అంతా కరోనా సమయంలో కుర్కురే ప్యాకెట్లు పంచినంత గొప్పవే. ఆయన పనితనానికి ఉదాహరణ ఆరేండ్లుగా అతీగతీ లేని అంబర్పేట ఫ్లై ఓవర్. ఇది కేంద్రం నిర్మిస్తున్న ఫ్లై ఓవర్. ప్రస్తుతం కిషన్రెడ్డి కేంద్రమంత్రిగా ఉన్నారు. ఆయన నియోజకవర్గంలో జరుగుతున్న పనిని కూడా సకాలంలో పూర్తి చేయించలేదు. 2018 ఎన్నికల్లో ప్రజలు కిషన్రెడ్డిని ఓడించి కాలేరు వెంకటేశ్ను గెలిపించిన తర్వాత ఐదేండ్లలోనే రూ.441 కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయి. తాగునీటి సమస్య పరిష్కారమైంది. ప్రజల కష్టాలు తీరుతున్నాయి.
గతంలో వరదలొచ్చినప్పుడు ఇక్కడి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ జీవించే పరిస్థితి ఉండేది. ఈ పరిస్థితిని మార్చారు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్. ఫీవర్ హాస్పిటల్ ఎదురుగా రిటెయినింగ్ వాల్ నిర్మించారు. మోహినీచెరువు, పటేల్నగర్, ప్రేమ్నగర్, బాపునగర్ ప్రాంతాల్లో నాలా పనులు చేపట్టారు. వర్షాలు పడ్డప్పుడు వాటర్ లాగింగ్ సమస్య లేకుండా చర్యలు తీసుకున్నారు. ఓయూ నుంచి బర్కత్పుర -వైఎంసీఏ వరకు రోడ్లను సుందరీకరణ చేశారు. మహేశ్వరీ పరమేశ్వరీ థియేటర్ నుంచి కాచిగూడ రైల్వే స్టేషన్ వరకు, ఫీవర్ హాస్పిటల్ నుంచి తిలక్నగర్ వరకు, ఓయూ చౌరస్తా నుంచి ఛే నంబర్ వరకు, శ్రీరమణ థియేటర్ నుంచి అలీ కేఫ్ మీదుగా గోల్నాక వరకు సీఆర్ఎంపీ రోడ్లను నిర్మించారు.
ఇక్కడి కాలనీలు, బస్తీల్లో 784 అభివృద్ధి పనులను చేపట్టారు. కొత్త సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, వీడీసీసీ రోడ్లను వేయించారు. డ్రైనేజీ, పైప్లైన్ పనులు చేయించారు. రూ.20 కోట్లతో థీమ్ పార్కులను అభివృద్ధి చేశారు. అంబర్పేట నుంచి నాగోల్కు సులువుగా వెళ్లేలా అలీకేఫ్ చౌరస్తా మీదుగా 120 ఫీట్ల రోడ్డును అభివృద్ధి చేశారు. మిషన్ కాకతీయలో భాగంగా మోహిని చెరువును సుందరీకరించారు. భారీ వర్షాలు కురిసే సమయంలో ముసారాంబాగ్ బ్రిడ్జి వద్ద రాకపోకలు నిలిచిపోయి ట్రాఫిక్ సమస్య తలెత్తేది. ఈ సమస్యను పరిష్కరించేందుకు బ్రిడ్జి నిర్మాణ పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. చాదర్ఘాట్ దగ్గర మరో బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టారు. ముస్లిం శ్మశానవాటిక కోసం కోట్లాది రూపాయల విలువజేసే స్థలాన్ని అప్పగించారు. ఇలా అనేక అభివృద్ధి పనులతో ఐదేండ్లలోనే అంబర్పేట రూపురేఖలు మార్చేశారు వెంకటేశ్. ఈ ఎన్నికల్లో మరోసారి పోటీ చేస్తున్నారు.
ట్రాఫిక్, ముంపు సమస్యల్లో నెట్టిన ఘనుడు l బీఆర్ఎస్ను గెలిపించిన తర్వాతనే తీరుతున్న ప్రజల కష్టాలు