బేగంపేట్, మార్చి 12: ప్రాణాపాయస్థితిలో హైదరాబాద్కు వచ్చిన జాంబియా దేశానికి చెందిన నర్సుకు కిమ్స్ వైద్యులు శస్త్రచికిత్స చేసి ప్రాణాలు నిలబెట్టారు. ఆదివారం కిమ్స్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ లాప్రోస్కోపిక్ హెపటో పాంక్రియాటికోబైలరీ సర్జన్ డాక్టర్ జి.పార్థసారధి వివరాలు వెల్లడించారు. దక్షిణాఫ్రికా మధ్య దేశమైన జాంబియాలోని ఓ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న 36 ఏండ్ల మహిళకు ముగ్గురు పిల్లలు. కొంతకాలం కిందట ఆమెకు తాను పనిచేసే వైద్యశాలలోనే హిస్టరెక్టమీ ఆపరేషన్ జరిగింది. ఆ సమయంలో పొరపాటున గర్భసంచి తొలగించే క్రమంలో పేగులకు కూడా గాయమైంది. కొన్నాండ్ల తర్వాత సమస్యలు రావడంతో మళ్లీ పేగులకైన గాయానికి కుట్లు వేశారు. కొంత కాలం తర్వాత అది విఫలమై… మూత్ర విసర్జన మార్గం నుంచే మల విసర్జన కావడం లాంటి పలు రకాల సమస్యలు తలెత్తాయి. దీంతో ఏడు సార్లు శస్త్ర చికిత్స చేయించారు. అయినా ఎలాంటి ఫలితం లేదు. కడుపులో తీవ్ర ఇన్ఫెక్షన్ అయింది.
చివరకు పొట్టమీద వేసిన కుట్లలోంచి అన్నీ బయటకు రావడం మొదలైంది. దీంతో అక్కడి వైద్యులు చేతులెత్తేశారు. దీంతో ఆ నర్సును హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. కిమ్స్లో తొలుత శస్త్ర చికిత్స చేసి పేగులకు కుట్లు వేశారు. అప్పటికే పేగులకు తీవ్ర ఇన్ఫెక్షన్ రావడంతో కత్తిరించి తీసేశారు. ఈ శస్త్ర చికిత్సకు 7 గంటల సమయం పట్టింది. క్లిష్టమైన శస్త్ర చికిత్స కావడంతో 10 రోజులు ఐసీయూలో ఉంచాల్సి వచ్చిందని వైద్యులు వివరించారు. తర్వాత మరో శస్త్ర చికిత్స చేసి మల విసర్జన సహజ పద్ధతిలో జరిగేలా ఆ మార్గాన్ని కూడా పునరుద్ధరించినట్లు తెలిపారు. ఈ ఆపరేషన్ తర్వాత ఆమె పరిస్థితి సాధారణంగా మారింది. నోటి ద్వారానే ద్రవ, ఘన పదార్థాలు తీసుకోగలుగుతున్నారు. ప్రస్తుతం ఆమె పూర్తి స్థాయిలో కోలుకున్నట్టు వైద్యులు వెల్లడించారు. సుమారు మూడు నెలల పాటు కిమ్స్ ఆసుపత్రిలో ఉంచి ఆమెకు వైద్యాన్ని అందించారు.