సమయాన్ని వృథా చేసుకుంటున్న యువత
సెల్ఫోన్ వాడొద్దంటే.. పేరెంట్స్పై అసహనం
చరవాణి అతి వాడకంతో మానసిక సమస్యలు
430 మంది విద్యార్థుల నుంచి అభిప్రాయాల సేకరణ
‘ఐసీఎంఆర్’ సర్వేలో వెల్లడి
సిటీబ్యూరో, జూన్ 18 ( నమస్తే తెలంగాణ ) : నగర యువత మానసిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నది. బంధాలను విచ్ఛిన్నం చేసుకుని ఆగమవుతున్నది. కుటుంబ సభ్యులు, స్నేహితులను దూరం చేసుకుంటున్నది. లక్ష్యం మరిచి సమయం వృథా చేసుకుంటున్నది. యువతను అంతలా దిగజార్చుతున్న రక్కసి మాత్రం సెల్ఫోనే. ఔను మొబైల్ మాయలో పడి మానసికంగా సతమతమవుతున్న యువకుల సంఖ్య నగరంలో క్రమంగా పెరుగుతున్నదని ఐసీఎంఆర్ నేతృత్వంలో జరిగిన ‘కాన్సిక్వెన్స్ ఆఫ్ ఫబింగ్ ఆన్ సైకలాజికల్ డిస్ట్రెస్’ సర్వే వెల్లడించింది. మొబైల్నే జీవితంగా భావిస్తున్న యువత.. మరో అంశంపై ఎలాంటి ధ్యాస లేకుండా రోజంతా గడుపుతున్నదని సర్వే ప్రకటించింది. చుట్టుపక్కల వారితో సంబంధం లేకుండా సెల్ఫోన్తోనే గంటల తరబడి గడుపుతున్నట్లు పేర్కొంది.
చిరాకు పడుతున్నారు..
డాక్టర్ బాల కొన్ని కేసు స్టడీలను ఉదహరించారు. 20 ఏండ్ల ప్రారంభంలో ఒక యువకుడు తన ఫోన్ను అధిక సమయం వినియోగించడాన్ని తల్లి నిరోధించేందుకు ప్రయత్నిస్తే అతడు అమ్మతో ఘర్షణకు దిగాడు. సెల్ఫోన్ వాడకం వద్దని చెబితే తల్లిదండ్రులపై చిరాకు పడుతున్నారని బాల వెల్లడించారు. చాలా మంది గేమింగ్ వ్యసనం రూపంలో జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 14 ఏండ్ల బాలుడు తన పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్నప్పటికీ రోజుకు 18 గంటల వరకు ఆన్లైన్ గేమ్ ఆడుతూ గడిపాడు. చదువు మానేయడం, బయటికి వెళ్లడం చేసే వాడు. అతడి తల్లి తన ఫోన్ను తీసివేసినప్పుడు సాధారణంగా ప్రశాంతంగా ఉండే బాలుడు.. తన తల్లి పట్ల చిరాకు చూపించి వాదనకు దిగేవాడని తెలిపారు.
సుమారు 430 మంది..
ఐసీఎంఆర్ మద్దతుతో డాక్టర్ బాల, ధరణి టెక్కం, హర్షల్ పాండవ్లు ఈ సర్వే చేపట్టారు. సుమారు 430 మంది మెడిసిన్, ఇంజినీరింగ్, ఆర్ట్స్, యునానీ కాలేజీ విద్యార్థుల నుంచి వివిధ ప్రశ్నావళితో వారి నుంచి సమాధానాలు తీసుకున్నారు. వాటిని పరిశీలించిన సర్వే బృందం.. నగరంలో 52 శాతం మంది యువత ఫోన్లోనే మునిగి సమయం, ఆరోగ్యం పాడు చేసుకుంటున్నదని, 34 శాతం మంది మానసిక వేదనతో బాధపడుతున్నట్టు తేల్చింది.