ఉత్సాహంగా పాఠశాలలకు వచ్చిన విద్యార్థులు
మొదటి రోజు 38.52 శాతం హాజరు నమోదు
కరోనా తర్వాత పూర్తి స్థాయిలో తెరుచుకున్న పాఠశాలలు
క్రమంగా పెరుగనున్న ప్రవేశాల సంఖ్య
మొదటి నెల మొత్తం బ్రిడ్జి కోర్సులతో పిల్లలకు పాఠాలు బోధన
ఆ తర్వాత రెగ్యులర్ తరగతులు ప్రారంభం
చర్యలు చేపట్టిన జిల్లా విద్యాధికారులు
ఇప్పటికే 40 శాతం స్కూళ్లకు చేరిన ఉచిత పాఠ్యపుస్తకాలు
మహబూబియా పాఠశాలను సందర్శించిన మంత్రి సబితారెడ్డి
సిటీబ్యూరో, జూన్ 13(నమస్తే తెలంగాణ) : రెండేండ్ల సుదీర్ఘ విరామం తర్వాత బడులు సోమవారం నుంచి సంపూర్ణంగా తెరుచుకున్నాయి. విద్యార్థులు ఉత్సహంగా స్కూళ్లకు వచ్చారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో స్కూళ్లు తెరుచుకున్న మొదటి రోజు 38.52 శాతం విద్యార్థుల హాజరు నమోదైనట్లు జిల్లా కలెక్టర్ ఎల్.శర్మన్, జిల్లా విద్యాధికారి రోహిణి వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు కలిపి మొత్తం 691 ఉన్నాయని, వాటిలో 1,17,503 మంది విద్యార్థులు ఉన్నారని పేర్కొన్నారు. అయితే, వారిలో సోమవారం 45,258 మంది విద్యార్థులు హాజరైనట్లు జిల్లా విద్యాధికారులు తెలిపారు. మరో వారం రోజుల్లో విద్యార్థుల సంఖ్య 80 వేలు దాటుతుందని పేర్కొన్నారు. మనబస్తీ- మనబడి పథకంలో భాగంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని
రకాల మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు.
40 శాతం స్కూళ్లకు చేరిన పాఠ్య పుస్తకాలు..
సోమవారం నుంచి పాఠశాలలు పూర్తిగా తెరుచుకోవడంతో మొదటి రోజు నుంచే విద్యార్థులు చదువుకోవడానికి వీలుగా ఉండేందుకు 40 శాతం ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ ప్రక్రియ పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన 60 శాతం పుస్తకాలు వీలైనంత త్వరలోనే జిల్లాలోని అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలలకు చేరుకునే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కరోనా వల్ల గత రెండేండ్లు స్కూళ్లు తెరుచుకోలేదు. ఆన్లైన్, టీవీ, ఇతర మాధ్యమాల ద్వారా బోధన కొనసాగించారు. దీంతో విద్యార్థుల చదువులో కొంత వ్యత్యాసం వచ్చింది. దానిని భర్తీ చేయడం కోసం మొదటి నెల మొత్తం విద్యార్థులందరికీ బ్రిడ్జి కోర్సును బోధించనున్నారు. అందుకోసం టీచర్లకు కూడా అవసరమైన శిక్షణ ఇచ్చారు. అదే విధంగా.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో బోధనా విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు.
ప్రభుత్వ పాఠశాలల్లో 2,271 కొత్త ప్రవేశాలు..
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను భారీగా పెంచేందుకు విద్యా శాఖ అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ఈ నెల మొదటి వారంలో ప్రారంభమైన బడిబాట కార్యక్రమం ద్వారా జిల్లా వ్యాప్తంగా 2,271 మంది విద్యార్థులు కొత్తగా ప్రవేశాలు పొందినట్లు డీఈవో రోహిణి తెలిపారు. స్కూళ్లు ప్రారంభమైన మొదటి రోజు 459 మంది విద్యార్థులు అడ్మిషన్ తీసుకున్నారని తెలిపారు. ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో 189 మంది చేరినట్లు అధికారులు ధ్రువీకరించారు. ప్రైవేటు నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోకి వచ్చే విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నదని అధికారులు తెలిపారు.
రాజ్భవన్ హైస్కూల్.. హౌస్ఫుల్
ఖైరతాబాద్, జూన్ 13 : సోమాజిగూడలోని రాజ్భవన్ హైస్కూల్కు విద్యార్థుల తల్లిదండ్రులు అడ్మిషన్ల కోసం బారులు తీరారు. గత వారం రోజులుగా నూతన అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. కాగా, సోమవారం భారీగా తరలిరావడంతో వారిని సముదాయించేందుకు డిప్యూటీ ఈవో చిరంజీవులు స్వయంగా పాఠశాలకు చేరుకున్నారు. మన ఊరు- మన బడి, మనబస్తీ – మన బడి లాంటి కార్యక్రమాలతో అనేక స్కూళ్లను ప్రభుత్వం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నది. రాజ్భవన్ హైస్కూల్లో అనుకున్న దాని కంటే ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉన్నారు. దీంతో ఎర్రమంజిల్, ఖైరతాబాద్లోని వాసవీ ప్రాక్టీసింగ్ స్కూల్, తదితర ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని డిప్యూటీ ఈవో చిరంజీవులు విద్యార్థుల తల్లిదండ్రులకు సూచిస్తున్నారు.
చాలా ఆనందంగా ఉంది
మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా తమ పాఠశాలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేయడం చాలా ఆనందంగా ఉంది. పాఠశాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడంతో పాటు విద్యార్థులకు మెరుగైన వసతులను కల్పించాం. దీంతో విద్యార్థులకు విద్యపై ఆసక్తి పెరుగుతుంది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెరుగుతోంది. మరింత పెరగడానికి ఆస్కారం ఉంది.
– వీవీ శారద, ప్రిన్సిపాల్, ఆలియా మోడల్ స్కూల్
చాలా హ్యాపీగా వచ్చాం
మా స్కూల్ ప్రైవేట్ పాఠశాలకు ఏం తక్కువ లేదు. కొత్త బెంచీలు, బోర్డులు, ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. అనేక రకాల వసతులు కల్పించారు. గతంలో పాఠశాలకు రావాలంటే ఎంతో బోరుగా ఉండేది. ఇప్పుడు పాఠశాలకు సంతోషంగా వచ్చాం. – జోయా ఫాతిమా, ఐదో తరగతి విద్యార్థిని, మహబూబియా స్కూల్