శంషాబాద్ రూరల్, ఆగస్టు 21 : వ్యాపారం పేరుతో అప్పు తీసుకున్నాడు. బాకీ తీర్చమన్నందుకు మరో ముగ్గురిని తోడు చేసుకొని అప్పు ఇచ్చిన మహిళ కుమారుడి(16)ని కిడ్నాప్ చేశాడు. బాలుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ఏడు గంటల్లోనే మిస్టరీని ఛేదించారు. ప్రధాన నిందితుడితో పాటు అతడికి సహకరించిన ముగ్గురిని కూడా అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సోమవారం శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి మీడియాకు వివరించారు. అనంతపూర్ జిల్లాకు చెందిన లక్ష్మి పదేండ్ల కిందట కడ్తాల్ వచ్చి.. వేర్వేరు ప్రాంతాల్లో కూరగాయల నర్సరీలు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నది. ఆమెకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు (16) ఇంటర్ చదువుతూ.. నర్సరీ పనుల్లో తల్లికి సహాయంగా ఉంటున్నాడు. ఇదిలా ఉండగా.. ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో తల్లి నిద్రలేని చూడగా.. చిన్న కుమారుడు కనిపించలేదు. చుట్టుపక్కల వెతుకగా.. కొద్దిదూరంలో బాలుడి స్కూటీ కనిపించింది. అతడికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. ఉదయం 8.20 గంటల సమయంలో లక్ష్మి సోదరుడైన ప్రసాద్ ఫోన్ నుంచి కాల్ చేయగా.. గుర్తు తెలియని వ్యక్తి మాట్లాడి బాలుడిని కిడ్నాప్ చేసినట్లు చెప్పాడు. రూ.2 కోట్లు ఇవ్వాలని, లేదంటే బాలుడిని చంపేస్తామని, పోలీసులకు చెప్పినా మీ కొడుకు మీకు దక్కడని చెప్పి ఫోన్ కట్చేసి.. స్విచ్ఛాఫ్ చేశాడు. లక్ష్మి వెంటనే కడ్తాల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజ్, సెల్ఫోన్ కాల్ ఆధారంగా సాంకేతిక పరిజ్ఞానంతో కర్నూలు జిల్లాలోని అలూరు పోలీస్స్టేషన్ పరిధిలో అక్కడి పోలీసుల సహకారంతో కిడ్నాప్ ముఠాను అరెస్టు చేసినట్ల్లు డీసీపీ తెలిపారు. బాలుడిని క్షేమంగా తల్లి ఒడికి చేర్చారు. నిందితులను అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు.
అసలేమైంది..
అనంతపూర్కు చెందిన బసవరాజు కొంత కాలం లక్ష్మి నర్సరీలో పనులు చేశాడు. ఆ సమయంలో లక్ష్మి వద్ద నుంచి, ఆమె ద్వారా మరికొంత మంది నుంచి వ్యాపారం పేరుతో దాదాపు రూ. 11 లక్షలు తీసుకున్నాడు. బాకీ డబ్బులు అతడు తిరిగి ఇవ్వలేదు. అప్పు తీర్చాలంటూ ఇటీవల లక్ష్మి ప్రశ్నించింది. దీంతో బసవరాజు మరో ముగ్గురి సహాయం తీసుకొని లక్ష్మి చిన్న కుమారుడిని కిడ్నాప్ చేసి, ఆ తర్వాత డబ్బులు డిమాండ్ చేసి వసూలు చేయాలని పథకం వేశాడు. ఈ పథకంలో భాగంగా శనివారం సాయంత్రం లక్ష్మి చిన్న కుమారుడికి ఫోన్ చేసిన నిందితులు.. మొక్కలు కావాలని అడిగారు. ఆదివారం ఉదయం రావాలని బాలుడు చెప్పాడు. దీంతో ఆదివారం తెల్లవారు జామున నిద్రలేచిన బాలుడు ఇంటి నుంచి తన స్కూటీపై నర్సరీ వద్దకు వెళ్లి కనిపించలేదు. పలు చోట్ల గాలించగా అతడి స్కూటీ కనిపించింది. ఆ తర్వాత ఫోన్కాల్ చేయగా.. కిడ్నాప్ ఉదంతం బయటపడింది.
సీసీ కెమెరాలు, సెల్ఫోన్ కాల్స్..
సీసీ కెమెరాలు, సెల్ఫోన్ కాల్స్ ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులు కర్నూలులో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అక్కడి స్థానిక పోలీసుల సహాయంతో అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు బసవరాజుతోపాటు వికారాబాద్ జిల్లాకు చెందిన సాయికుమార్, భుజంగం, కుమార్ను కూడా అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. నిందితుల నుంచి ఓ కారుతో పాటు నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.