సుల్తాన్బజార్, ఆగస్టు 5: ప్రేమ వివాహం చేసుకునేందుకు నగరానికి వచ్చిన ఓ జంట కిడ్నాప్నకు గురైంది. ఈ సంఘటన సుల్తాన్బజార్ పీఎస్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ భిక్షపతి, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లాలోని బండగొండ గ్రామానికి చెందిన శివశంకర్, అదే జిల్లా నిర్జింత గ్రామానికి చెందిన హర్షిత రెడ్డి చదువుకుంటున్న సమయంలో ప్రేమలో పడ్డారు. వీరి కులాలు వేరు కావడంతో ఇరు కుటుంబాలు ప్రేమ వివాహం చేసుకునేందుకు ఒప్పుకోలేదు. దీంతో ఈ ప్రేమజంట ఎలాగైనా వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో నగరంలోని బీహెచ్ఈఎల్ ప్రాంతానికి చెందిన స్నేహితుల సహకారంతో బడీచౌడీలోని ఆర్యసమాజ్కు చేరుకున్నారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆర్య సమాజ్లోకి వీరు వెళ్తున్న క్రమంలో అక్కడికి చేరుకున్న కొంత మంది శివశంకర్పై దాడిచేసి, ప్రేమ జంటను కారులో ఎక్కించుకొని వెళ్లిపోయారు. అక్కడున్న శివశంకర్ స్నేహితులు సుల్తాన్బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కిడ్నాప్ కేసుగా నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా గంట వ్యవధిలోనే ఈ కేసును ఛేదించామని ఇన్స్పెక్టర్ తెలిపారు. కేసు దర్యాప్తులో ఉందని, పూర్తి వివరాలు తర్వాత చెబుతామన్నారు.