బంజారాహిల్స్,అక్టోబర్ 6: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించే లక్ష్యంతో ప్రభుత్వం ‘సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్’ను ప్రవేశపెట్టిందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఎర్రమంజిల్ ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం ఎమ్మెల్యే దానం నాగేందర్ చేతులమీదుగా ‘సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్’ను ప్రారంభించారు. స్కూల్ విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే దానం బ్రేక్ఫాస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. ఉరుకులు పరుగుల నగర జీవితంలో ఉదయాన్నే తమ పిల్లలకు సరైన ఆహారాన్ని వండిపెట్టలేని పేద కుటుంబాల పరిస్థితిని అర్థం చేసుకున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం ‘సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్’ పథకాన్ని ప్రారంభించారన్నారు. దీనివల్ల తల్లిదండ్రులకు ఊరట లభించడంతో పాటు పేద విద్యార్థులకు పూర్తిస్థాయిలో బలవర్థకమైన ఆహారం లభిస్తుందన్నారు. ఉదయాన్నే టిఫిన్ తినకుండా స్కూల్కు రావడంతో విద్యార్థులు ఆకలితో ఇబ్బంది పడుతుంటారని, అలాంటి వారు చదువులపై ఏకాగ్రత చూపడం సాధ్యం కాదన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఈవో శామ్యూల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.
నాకు నలుగురు పిల్లలున్నారు. నా భర్త ఫ్లంబర్గా పనిచేస్తుంటాడు. చంటి పిల్లలను చూసుకోవడంతో పాటు ఇద్దరు పిల్లలను రెడీ చేసి స్కూల్కు పంపించడం రోజూ యుద్ధంలాగానే ఉండేది. రాత్రి మిగిలిన అన్నంతో పాటు అప్పుడప్పుడూ టిఫిన్ తీసుకువచ్చి ఇచ్చేవాళ్లం. అప్పుడప్పుడూ టీ బిస్కట్లు తిని స్కూల్కు వెళ్లాల్సి వచ్చేది. దీంతో పిల్లలు సాయంత్రం వచ్చేసరికి నీరసంగా ఉండేవారు. ఆకలితో ఉండే పిల్లలకు కడుపునిండా మంచి ఆహారం ఇస్తున్న దేవుడు కేసీఆర్ సార్ చల్లగా ఉండాలి.
-కృష్ణవేణి, ఎర్రమంజిల్ కాలనీ
ముగ్గురు మనవళ్లు ప్రభుత్వ స్కూల్లో చదువుతున్నారు. వారికి ఉదయాన్ని టిఫిన్ తయారు చేసి తినిపించడానికి సమయం సరిపోకపోయేది. దాంతో అప్పుడప్పుడూ చాయ్ మాత్రమే తాగివెళ్లేవారు. ఒక్కోసారి టిఫిన్ తిని వెళ్లేవాళ్లు. లేటుగా లేస్తే ఉపవాసమే వెళ్లాల్సి వచ్చేది. స్కూల్కు వెళ్లిన గంటసేపట్లోనే అలిసిపోయే వాళ్లు. బ్రేక్ఫాస్ట్ స్కూల్లోనే పెట్టడం ఎంతో సంతోషంగా ఉంది. దీనివల్ల ఇకనుంచి పిల్లలు సంతోషంగా చదువుకోవచ్చు. సీఎం కేసీఆర్ సార్కు థాంక్స్
– ఆర్.గీత, రామకృష్ణనగర్