బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ముందుగా తాము అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ పథకాలు అమలు చేసిన తర్వాతే ఇక్కడ ఓట్లు అడగాలని సవాల్ విసిరారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. జూబ్లీహిల్స్ డివిజన్ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం సోమవారం బంజారాహిల్స్ రోడ్ నం. 12లోని బంజారా భవన్లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న 62 సంక్షేమ పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేవని.. ఓట్లు అడిగే హక్కు కేవలం బీఆర్ఎస్కే ఉందని స్పష్టం చేశారు.
బంజారాహిల్స్, మే 29: తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో అమలు చేసిన తర్వాతే ఆ పార్టీల నాయకులు ఇక్కడ ఓట్లు అడగాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. సోమవారం బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని బంజారా భవన్లో జూబ్లీహిల్స్ డివిజన్ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ తెలంగాణలో అమలవుతున్న 62 సంక్షేమ పథకాలు దేశంలోని మరే రాష్ట్రంలోనూ లేవన్నారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే అద్భుతాలు చేస్తామని చెబుతున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ముందుగా వారు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఇక్కడి పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పేవన్ని తొండి మాటలని, ఎంతో ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఓ బ్లాక్మెయిలర్ను నియమించుకోవడం సిగ్గు చేటన్నారు. తెలంగాణను తీర్చిదిద్దిన బీఆర్ఎస్కు మాత్రమే ఓట్లు అడిగే హక్కు ఉందని.. కేవలం సీఎం కేసీఆర్ను తిట్టడమే ప్రతిపక్షాలు ఎజెండాగా పెట్టుకున్నాయని విమర్శించారు.
‘ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెడుతుంటే ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. విదేశాల్లో పర్యటిస్తూ మంత్రి కేటీఆర్ పెట్టుబడులు తెస్తుంటే కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాత్రం ఆ సంస్థలను బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు దండుకునే ప్రయత్నాలు చేయడం దుర్మార్గం.’ అని ఎమ్మెల్యే దానం అన్నారు. కాంగ్రెస్ను కడిగేయాలని.. మతతత్వ బీజేపీని పాతరేయాలన్నారు. ప్రధాని మోదీ కర్నాటక ఎన్నికల సమయంలో దేవుళ్ల పేరుతో ఓట్లు అడగటం ఆ పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ప్రసన్నరామ్మూర్తి, కార్పొరేటర్ వెల్దండ వెంకటేష్, మాజీ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ, మామిడి నర్సింగరావు, దయ్యాల దాసు, విష్ణు నాయక్, గోపాల్నాయక్, దీపాదేవి, పద్మ, కిరణ్. శంకర్, రమేశ్ పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణలో జరిగిన అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాలను ప్రతిఒక్కరికి వివరించాల్సిన బాధ్యత బీఆర్ఎస్ కార్యకర్తలు తీసుకోవాలని బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి దాసోజు శ్రవణ్కుమార్ కోరారు. తెలంగాణ వాసులకు పాలన చేతగాదని ఆనాడు విమర్శించిన వారికి దిమ్మదిరిగేలా సీఎం కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారని కొనియాడారు. మంత్రి కేటీఆర్ దార్శనికతతో హైదరాబాద్ విశ్వనగరంగా మారుతున్నదన్నారు. హైదరాబాద్ను సందర్శిస్తున్న అనేక మంది ప్రముఖులు ఇక్కడి ప్రగతిని కొనియాడుతుండటం మనందరికి గర్వకారణమన్నారు. రంగం ఏదైనా తెలంగాణను నంబర్ వన్లో నిలిపిన మహా నేత సీఎం కేసీఆర్ అని కొనియాడారు. ఇలా దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా చేసిన సీఎం కేసీఆర్ను మరోసారి గెలుపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సంక్షేమ పథకాలపై కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పి కొట్టాలన్నారు. రాబోయే రెండు మూడు నెలలు ఎంతో కీలకమన్నారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధిని ప్రతి కార్యకర్త ఇంటింటికి వెళ్లి వివరించాలన్నారు. ఒకప్పుడు తెలంగాణ బడ్జెట్ రూ.50 వేల కోట్లు ఉంటే ఇప్పుడు మూడు లక్షల కోట్లకు పెంచారన్నారు.