ఖైరతాబాద్ మహాగణపతి భక్తులకు దర్శనమిస్తారు. ఖైరతాబాద్ చరిత్రలోనే 63 అడుగుల ఎత్తులో స్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తుండడం విశేషం.
ఖైరతాబాద్, ఆగస్టు 17: “దశ మహా విద్యా స్వరూపుడు” ఈ ఏడాది ఖైరతాబాద్ మహా గణపతిగా భక్తులకు దర్శనమిస్తారు. ఖైరతాబాద్ చరిత్రలోనే 63 అడుగల ఎత్తులో స్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్టించడం విశేషం. సరస్వతి, వారాహీ మాతలతో పాటు పంచముఖ లక్ష్మీనరసింహస్వామి, శ్రీ వీరభద్ర స్వామి సమేతంగా భారీ మట్టి విగ్రహాన్ని ప్రతిష్టిస్తున్నారు. ఇప్పటికే 50 శాతం విగ్రహ నిర్మాణం పూర్తి కాగా, వచ్చే నెల 19వ తేదీ వినాయక చవితికి వారం రోజుల ముందే విగ్రహాన్ని సిద్ధం చేసేందుకు ఉత్సవ కమిటీ ఏర్పాట్లు చేసింది. శిల్పి రాజేంద్రన్ పర్యవేక్షణలో ఈ విగ్రహం రూపుదిద్దుకుంటుండగా, గురువారం రాత్రి ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ విగ్రహ నమూనాను విడుదల చేసింది.
క్రోదం నుంచి శాంతి వైపు..
ఖైరతాబాద్ గణపతి విగ్రహ నమూనాను ఆగమ శాస్త్రానుగుణంగా రూపొందించారు. ఖైరతాబాద్లో ప్రతిష్టించనున్న శ్రీ దశ మహా విద్యా గణపతికి అనేక విశిష్టతలున్నాయి. అమ్మ వారి శాస్త్రీయ ఉపాసనలో దశ మహా విద్యలు చాలా గొప్పవి. పది రకాల ఉపాసనలు ఆగమ శాస్త్రంలో వివరించగా, దశ మహా విద్యాదేవతలైన వారాహీ, కాళీ, తారా, త్రిపుర సుందరి, భువనేశ్వరి భైరవి, చిన్న మత్స్య, ధూమవతి, భగల్ముఖి, మాతంగి, కమలను పూజించిన పుణ్యం ఖైరతాబాద్లో ప్రతిష్టిస్తున్న శ్రీ దశ మహా విద్యా గణపతిని దర్శించుకుంటే దక్కుతుందని దివ్యజ్ఞాన సిద్ధాంతి గౌరీభట్ల విఠలశర్మ వివరించారు. స్వామి వారిని దర్శించుకుంటే పంచనారసింహ క్షేత్రంగా కొలువబడుతున్న లక్ష్మి, యోగ, జ్వాలా, ఉగ్ర, గండబేరుండ నరసింహస్వామి వారిని దర్శించుకున్న పుణ్యం దక్కుతుందని సిద్ధాంతి చెబుతున్నారు. అలాగే, శివకేశవులను ప్రతిష్టించాలన్న సంకల్పంతో శివుని ఉగ్ర స్వరూపమైన శ్రీ వీరభద్రుడిని ప్రతిష్టిస్తున్నారు.