Hyderabad | బంజారాహిల్స్, మార్చి 22: మంచి చెడులు నేర్పించి.. పిల్లలను సరైన దారిలో నడిపించాల్సిన ఆ తల్లి తన కుమారులను తప్పుదారి పట్టించింది. తాను దొంగతనాలు చేయడమే కాకుండా.. ముగ్గురు కొడుకులను కూడా అదే మార్గంలోకి దించింది. తాళం వేసిన ఇళ్లను గుర్తించడం.. తన కొడుకులను ఆ ఇంటికి పంపించి దొంగతనాలు చేయించడం.. చోరీసొత్తును గుట్టు చప్పుడు కాకుండా అమ్మడమే కాకుండా వారి తరఫున లాయర్లను మాట్లాడి బెయిల్ ఇప్పించడం అలవాటుగా మార్చుకుంది. నగరంలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీ ఘటనల్లో నిందితురాలిగా ఉన్న కరడుగట్టిన నేరస్థురాలు సనా బేగం అలియాస్ సనా టైగర్ అలియాస్ సనా డాన్(48) తో పాటు ఆమె కొడుకు సోహైల్ (26)ను డైమండ్ హిల్స్ కాలనీలో చోరీ ఘటనలో అరెస్ట్ చేసిన ఫిలిం నగర్ పోలీసులు రిమాండ్ తరలించారు.
వివరాల్లోకి వెళ్తే.. షేక్పేట సమీపంలోని డైమండ్ హిల్స్ కాలనీకి చెందిన మహ్మద్ ముజాహిద్ కమల్ అనే ఎన్ఆర్ఐ ఇంట్లో ఇటీవల 34 తులాల బంగారు ఆభరణాలతో పాటు సుమారు 4.5 లక్షల నగదు, విదేశీ కరెన్సీ చోరీ అయ్యింది. బండ్లగూడకు చెందిన సనా బేగం అలియాస్ సనా టైగర్ అలియాస్ సనా డాన్(48) తన ముగ్గురు కుమారులు మహమ్మద్, సాహిల్, సోహైల్తో కలిసి ఈ దొంగతనానికి పాల్పడింది. దొంగతనం అనంతరం ఆటోలో పారిపోతున్న క్రమంలో పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు నిందితులు అనేక ప్లాన్లు వేశారు. చోరీ అనంతరం నేరుగా బండ్లగూడలోని తమ ఇంటికి వెళ్తే సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు గుర్తించే అవకాశం ఉందని భావించి.. సుమారు రెండు గంటల పాటు రాజేంద్రనగర్ పరిసర ప్రాంతాల్లోని కొన్ని బస్తీలోని సందుగొందుల్లో తిరిగారు. అయినప్పటికీ పట్టువదలని విక్రమార్కుల్లా పోలీసులు 500కి పైగా సీసీ కెమెరాలను సుమారు 40 గంటల పాటు జల్లెడపట్టి ఎట్టకేలకు బండ్లగూడలోని నిందితుల నివాసాన్ని గుర్తించారు. అయితే పోలీసులు తమ ఇంటికి వస్తున్నారన్న విషయం తెలుసుకున్న నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. కాగా, దొంగిలించిన బంగారంలో కొంత భాగాన్ని అమ్మేందుకు ప్రయత్నించి సనా బేగం, ఆమె రెండో కొడుకు సోహైల్ పోలీసులకు చిక్కారు. వారి నుంచి 10 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
ఇదిలా ఉండగా శుక్రవారం రాత్రి నిందితురాలు సనా బేగం ను వైద్య పరీక్షల కోసం స్థానికంగా ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ కూడా ఆమె హైడ్రామా చేసినట్లు తెలిసింది. తనకు ఆరోగ్యం సరిగా లేదని.. తనను అరెస్టు చేసేలా రిపోర్ట్ ఇస్తే తర్వాత జరిగే పరిణామాలకు నీదే బాధ్యత అంటూ సదరు వైద్యుడిని దబాయించిందని తెలిసింది. ఎట్టకేలకు అర్ధరాత్రి దాటిన తర్వాత ఉస్మానియా ఆస్పత్రిలో పలు రకాల వైద్య పరీక్షల అనంతరం నిందితులను న్యాయమూర్తి ఎదుట హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. సనా బేగంపై దాదాపు 43 కేసులు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది.