సిటీబ్యూరో, జూలై 13 (నమస్తే తెలంగాణ ): వంద శాతం ఇంటింటి చెత్త సేకరణే లక్ష్యంగా జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రోస్ ప్రత్యేక కార్యాచరణ అమలుకు శ్రీకారం చుట్టారు. చెత్త రహిత నగరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా తరచూ చెత్త వేసే ప్రాంతాల (గార్భేజి వనరేబుల్ పాయింట్లు/జీవీపీ)పై యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నారు. గ్రేటర్లో డస్ట్ బిన్లు ఎత్తివేసి..స్వచ్ఛ ఆటోల ద్వారా ఇంటింటికి చెత్త సేకరణ ప్రక్రియ జరుపుతుండగా..అక్కడకక్కడ కొందరు బహిరంగంగానే చెత్త వేస్తున్నారు. ఇలా గ్రేటర్ వ్యాప్తంగా 2640 చోట్ల చెత్త కుప్పలున్నట్లు ఆస్కి (అడ్మినిస్ట్రేటివ్ స్టాప్ కాలేజ్ ఆఫ్ ఇండియా) సాయంతో జరిపిన సర్వేలో తేలింది. ఇదే విషయాన్ని నూతన కమిషనర్ రోనాల్డ్ రోస్ సీరియస్గా తీసుకున్నారు. క్షేత్రస్థాయి పర్యటనలు.. పారిశుద్ధ్య నిర్వహణపై ఏజెన్సీ, ఉన్నతాధికారులతో జరిపిన సమీక్షలోనూ జీవీపీ పాయింట్లపై ప్రత్యేకంగా చర్చించారు. ఇందులో భాగంగానే గురువారం పారిశుద్ధ్య నిర్వహణపై జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, సంబంధిత అధికారులతో కలిసి కమిషనర్ రోనాల్డ్ రోస్ సమీక్ష జరిపారు. అంతకు ముందు అధికారులతో కలిసి జవహర్నగర్ డంపింగ్ యార్డు కేంద్రాన్ని సందర్శించారు. బహిరంగ ప్రదేశాల్లో తరచుగా చెత్త వేసే వారిని గుర్తించి, చర్యలు తీసుకోవాలన్నారు. పారిశుద్ధ్య సూపర్ వైజర్లకు (ఎస్ఎఫ్ఏ) పర్యవేక్షణ బాధ్యతలు అప్పగిస్తూ ఉన్నతాధికారులకు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఒక్కో చోట ఎస్ఎఫ్ఏ బాధ్యత వహించనున్నారు. తరచుగా చెత్త వేసే వారికి జీహెచ్ఎంసీ జరిమానా సైతం విధించనుంది. బహిరంగ చెత్త పాయింట్ల తొలగింపు, స్వచ్ఛ ఆటోల పనితీరును మరింత మెరుగు పరుచుకోవటం, ప్రజల్లో స్వచ్ఛ పరిసరాలపై అవగాహన పెంచనున్నారు. అలాగే రాత్రిఫూట కొనసాగే హోటళ్లు, ఇతర తిను బండారాల దుకాణదారులకు చెత్త నిర్వహణపై అవగాహన కల్పించేందుకు కమిషనర్ రోనాల్డ్రోస్ ప్రత్యేక దృష్టి సారించారు.
స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దుదాం
అడ్డగుట్ట, జూలై 13 : పారిశుద్ధ్య నిర్వహణ మరింత మెరుగ్గా ఉండేలా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ అన్నారు. గురువారం సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో అన్ని జోన్ల జెడ్సీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ… చెత్తరహిత నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దడంలో అన్ని జోన్ల సహకారం అవసరమన్నారు. పౌరులకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా ఉన్నతాధికారులు, అధికారులు, సిబ్బంది పనిచేయాలని సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణలో మరిన్ని సంస్కరణలను తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఆ దిశగా అధికారులు పనితీరును మెరుగు పరుచుకోవాలన్నారు. ఎప్పటి చెత్తను అప్పుడే సేకరించాలని, చెత్తకుప్పలు లేని నగరంగా తీర్చిదిద్దడానికి అవసరమైన చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉంటే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సోలిడ్ వెస్ట్ మేనేజ్మెంట్ ఏసీ ఉపేందర్ రెడ్డి, సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ ఎన్. రవికిరణ్, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ బి.శ్రీనివాస్ రెడ్డి, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ ఎస్. పంకజ్, కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమతతో పాటు అధికారులు పాల్గొన్నారు.