కీసర, నవంబర్ 29: కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఈ సంవత్సరం కార్తిక మాసానికి సంబంధించిన ఆదాయం రూ.1,22,09,532 వచ్చింది. గత నెల 26 నుంచి ఈనెల 23వ తేదీ వరకు కార్తిక మాసం ప్రత్యేక పూజలను కీసరగుట్టలో నిర్వహించారు. నెలరోజుల పాటు జరిగిన ఈ పూజా కార్యక్రమాల్లో స్వామివారికి హుండీ, అభిషేకాలకు ద్వారా వచ్చిన ఆదాయాన్ని మంగళవారం దేవాదాయశాఖ ఆధ్వర్యంలో లెక్కించారు.
హుండీ పర్యవేక్షకులు వీరేశం, కీసరగుట్ట ఆలయ చైర్మన్ తటాకం ఉమాపతి శర్మ, కార్యనిర్వహణాధికారి కట్టా సుధాకర్రెడ్డి పర్యవేక్షణలో లెక్కించారు. ఈసారి ఆదాయం రూ.1,22,09,532 వచ్చింది. గత సంవత్సరం రూ.83, 78,150 వచ్చినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు . ఈ కార్యక్రమంలో భ్రమరాంబ సేవా సమితి, శ్రీ రాజరాజేశ్వరీ, శ్రీ సత్యసాయి సేవా సమితి, శ్రీ సద్గురు సాయి సేవా సమితి సభ్యులు, దేవాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.