కీసర, ఫిబ్రవరి 16:కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వరస్వామి సన్నిధిలో గురువారం నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. కీసరగుట్ట జాతరకు సీఎం కేసీఆర్ రూ.1కోటి రూపాయలు మంజూరు చేశారు. ఈనెల 16 తేదీ నుంచి 21వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి కలెక్టర్ అమోయ్కుమార్ ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య నేతృత్వంలో జిల్లా యాంత్రాంగం, దేవాదాయశాఖ అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. భక్తులు సులువుగా స్వామి వారిని దర్శించుకోవడానికి క్యూలైన్లు ఏర్పాటు చేశారు.
బ్రహ్మోత్సవాల్లో రోజువారీ కార్యక్రమాలు
కీసరగుట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం 11 గంటల నుంచి విఘ్నేశ్వరపూజ, పూణ్యాహవాచనము, పంతటచగవ్యస్థాపన, ఋత్విక్ వరణము, యాగశాల ప్రవేశం, అఖండ జ్యోతిష్టాపనము, రాత్రి 8గంటలకు శ్రీ స్వామివారు కీసరగుట్ట నుంచి కీసర గ్రామమునకు విచ్చేయుట, 17వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి రుద్రస్వాహాకర హోమము, సాయంత్రం 4గంటల నుంచి బిల్వార్చన,రాత్రి 8 గంటలకు శ్రీ స్వామి వారు కీసర గ్రామం నుంచి కీసరగుట్టకు విచ్చేయుట, 18వ తేదీ శనివారం ఉదయం 4గంటల నుంచి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రాత్రి 8 గంటల నుంచి నందివాహాన సేవ, 19వ ఆదివారం ఉదయం 5.30గంటల నుంచి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రాత్రి 7గంటలకు శ్రీ స్వామి వారికి విమాన రథోత్సవం, 20వ తేదీ సోమవారం ఉదయం 5.30 గంటల నుంచి సామూహిక అభిషేకాలు,రాత్రి 8గంటలకు వసంతోత్సవం,21వ తేదీ 4వ మంగళవారం ఉదయం 5.30గంటల నుంచి సామూహిక అభిషేకం (కల్యాణమంటపంలో), ఉదయం 7గంటలకు రుద్రస్వాహాకార హోమం, 11గంటలకు పూర్ణాహుతి, ఉత్సవ సమాప్తి పండిత సన్మానం కార్యక్రమాలతో కీసరగుట్ట జాతర బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు
స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయం తరుఫున తగిన ఏర్పాట్లు చేశాం. దర్శనం కోసం క్యూలైన్లను ఏర్పాటు చేశాం. వీఐపీతో పాటు స్వామివారి కల్యా ణం, శీఘ్రదర్శనంలకు కూడా ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. ఈ సంవ త్సరం కీసరగుట్ట జాతరకు సీఎం కేసీఆర్ రూ.1కోటి మంజూరు చేయడం చాలా సంతోషం. – ఆలయ చైర్మన్ తటాకం రమేశ్శర్మ