సిటీబ్యూరో, డిసెంబర్ 19(నమస్తే తెలంగాణ) : మారుతున్న ఆహారపు అలవాట్లు, కరోనా తర్వాత పెరిగిన మానసిక, శారీరక ఒత్తిళ్లు ఇలా అన్ని తోడై.. గుండె పనితీరును దెబ్బతిస్తున్నాయి. పది కాలాలు పదిలంగా ఉండాల్సిన హృదయం.. లయ తప్పి..అర్థాంతరంగా ఆగిపోతున్నది. వృద్ధులే కాదు.. యువ, నడి వయస్కులైన వారూ ప్రాణాలు కోల్పోతుండటం ఆందోళన కలిగిస్తున్నది.
కరోనా తర్వాత నవ యువకుల్లోనూ గుండె సంబంధిత వ్యాధులు పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇటీవల లోకల్ సర్కిల్ అనే సంస్థ నిర్వహించిన అధ్యయనంలో 51 శాతం మందిలో బ్రెయిన్, హార్ట్ స్ట్రోక్, రక్తం గడ్డకట్టుకుపోవడం, నరాల సంబంధిత వ్యాధులు రెండేండ్లలో విపరీతంగా పెరిగినట్లు తేలింది. దేశవ్యాప్తంగా 357 జిల్లాల పరిధిలో దాదాపు 32వేల మందితో చేసిన అధ్యయనం ప్రకారం ఈ వివరాలను సేకరించగా… ఒక్క ఏడాదిలోనే 31 శాతం అత్యవసర వైద్యం కేసులు పెరిగాయని వెల్లడైంది. ఇందులో గుండె సంబంధిత వ్యాధుల బారినపడిన వారిలో యువ, నడి వయస్కుల వారే ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనం పేర్కొంది.
ప్రభావం చూపుతున్న ఒత్తిడి
కరోనా ప్రభావమే కాకుండా జీవనశైలిలో వచ్చిన మార్పులు, ఆహారపు అలవాట్లు కూడా గుండె వ్యాధుల బారిన పడేలా చేస్తున్నట్లు తేలింది. వ్యాయామానికి దూరంగా ఉండటంతో శరీరంలో పేరుకుపోతున్న కొవ్వులు… రక్త ప్రసరణను నిలువరిస్తున్నాయని అంటున్నారు. పరిమితికి మించి మద్యపానం, ధూమపానం, డయాబెటిస్, పోషకాలు లోపించిన ఆహారం, అధిక బరువు వంటివి గుండె సంబంధిత వ్యాధులను పెరిగేలా చేస్తున్నట్లు చెబుతున్నారు.
వయస్సుతో సంబంధం లేకుండా..
వయస్సుతో సంబంధం లేకుండా వస్తున్న ఒత్తిడిని దూరం చేసుకుంటే గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ముఖ్యంగా ఒక్కసారిగా మారిపోయే స్ట్రెస్ లెవల్తో రక్తనాళాల పనితీరులో వచ్చే మార్పులు… గుండె సంబంధిత వ్యాధులకు కారణం కావచ్చు. రక్తనాళాల లోపలి పొరలు దెబ్బతిని గడ్డ కట్టుకుపోయే లక్షణాలు పెరిగే అవకాశం ఉంది. హార్ట్ ఎటాక్కు గురయ్యే ప్రమాదం ఉంటుంది.
– గుడిపాటి రమేశ్, కార్డియాలజిస్ట్, స్టార్ హాస్పిటల్
జీవన శైలి మార్చుకోవాల్సిందే
వయస్సుతో సంబంధం లేకుండా హృద్రోగాలు పెరుగుతున్న క్రమంలో ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ముఖ్యంగా నవ యువతీ యువకులు కూడా ఒత్తిడి లేని శారీరక వ్యాయామానికి ప్రాధాన్యతనివ్వాల్సి ఉంటుం ది. శరీరాన్ని అధిక ఒత్తిడికి గురిచేసేలా చేసే వ్యాయామాలు కూడా రక్తప్రసరణను ప్రభావితం చేస్తున్నాయి. ఇక పోస్ట్ కొవిడ్తో తలెత్తున్న అనారోగ్య సమస్యలు గుండె సంబంధిత వ్యాధులకు గేట్ వేగా మారుతున్నాయి. కరోనాతో క్లిష్టమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్న వారు వైద్యుల సలహాతో రక్త ప్రసరణను చక్కదిద్దే మందులను తీసుకోవడం, చెడు కొలెస్ట్రాల్ తగ్గించే వ్యాయామాలు, గుండె పనితీరును మెరుగుపరిచే విధానాలను అలవాటు చేసుకోవాలి.
– డాక్టర్ ప్రకాశ్ అజ్మీరా, కార్డియాల
జిస్ట్, మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్