Double bedroom house | సిటీబ్యూరో, సెప్టెంబర్ 5(నమస్తే తెలంగాణ): దేవుడు కరుణించినా పూజారి వరం ఇవ్వలేదన్నట్లుగా ఉమ్మడి పాలనలో ప్రభుత్వ పథకాలు ఉండేవి. సామాన్యుడి చేతికి వచ్చేంత వరకు మిగిలేది చిల్లి గవ్వే. ముఖ్యంగా సొంతింటి నిర్మాణం అంటే నాయకుల జేబులు నింపే భాండాగారమైతే… లబ్ధిదారులకు మాత్రమే గుదిబండలు మిగిలేవి. కానీ వాటిన్నింటికి భిన్నంగా సీఎం కేసీఆర్ చేపట్టిన పేదల సొంతింటి ప్రాజెక్టు నిలిచింది. రూపాయి ఖర్చు లేకుండానే పేదోడికి విశాలమైన ఇండ్లను అప్పగిస్తోంది. ఉచితంగా పేదలకు ఇంటిని కట్టించి ఇస్తామని చెప్పుకున్న అప్పటి ప్రభుత్వాలు అప్పులను మెడలో వేసి వేధింపులకు గురిచేశాయి. రాజీవ్ స్వగృహ, గృహకల్ప వంటి పథకాలైతే… మధ్యతరగతి వర్గాలను అప్పుల ఊబిలోకి దింపింది. ఇప్పటికీ వాటికి సంబంధించిన ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఎంతోమంది ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్ వ్యాప్తంగా లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించింది. కానీ ఉమ్మడి ప్రభుత్వం సిటీ వ్యాప్తంగా ఉన్నా రాజీవ్ గృహకల్ప, స్వగృహ, ఇందిరమ్మ ఇండ్ల ఇస్తామంటూ సంపాదించుకున్న ఆ కొంత మొత్తాన్ని కూడా లాగేసుకున్నది. ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా 12కు పైగా రాజీవ్ గృహకల్ప వంటి ప్రాజెక్టులు ఉండగా… అందులో దక్కించుకున్నవారు కూడా ఇప్పటికీ భారంగానే జీవనం సాగిస్తున్నారు.
అగ్గిపెట్టెలాంటి ఇండ్లను ఇంద్రభవనాలని అప్పటి ప్రభుత్వాలు చెప్పుకున్నాయి. 200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే ఇండ్లనే పలు పథకాల కింద అప్పగించి చేతులు దులుపుకొంది. అవీ కూడా ఉచితంగా ఇచ్చిందంటే పొరపాటే. కేంద్రం ఇచ్చే నిధులకు మెరుగులు అద్ది అరకొర వసతలతో చేతులు దులుపుకొంది. ఇక పేదలకు పక్కా గృహాల పేరిట కాంగ్రెస్ అమలు చేసిన పథకాలన్నీ కూడా సామాన్యుడి చెంతకు చేరకుండానే పక్కదారి పట్టిన ఘటనలు ఉన్నాయి. కానీ ఇందిరమ్మ ఇండ్ల కోసం ఇప్పటికీ… చలాన్లు కట్టి డబ్బులు వదిలేసుకున్న పేదలు ఎంతో మంది కనిపిస్తారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో రాజీవ్ స్వగృహ, జేఎన్యూఆర్ఎం వంటి ఇండ్లకు ఇప్పటికీ లోన్లు చెల్లించలేక ఇబ్బంది పడుతున్నారు.
నేడు రూపాయి కట్టకుండానే ఇల్లు..
స్వరాష్ట్ర సాధన తర్వాత సికింద్రాబాద్లో శిథిలావస్థలో ఉన్న ఐడీహెచ్ కాలనీ ఇండ్లను చూసి చలించిపోయిన సీఎం కేసీఆర్… డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. లక్ష ఇండ్లను నగరంలో నిర్మించి పేదలకు పంపిణీ చేయాలని భావించారు. అక్కడితో ఆగిపోకుండా ఏకంగా రూ. 10వేల కోట్ల పైగా నిధులతో 590 చదరపు అడుగుల విస్తీర్ణంలోని విశాలమైన ఇండ్లను నిర్మించారు. ప్రస్తుతం 69వేల ఇండ్ల నిర్మాణం పూర్తి కాగా… మరో 31వేల ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయి. తొలిదశలో భాగంగా 11700 ఇండ్లను రూపాయి తీసుకోకుండా పేదలకు సకల సదుపాయాలతో డబుల్ బెడ్రూం ఇండ్లను సీఎం కేసీఆర్ అందించారు. పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసి పట్టాలను అప్పగించారు. ఒక్కో ఫ్లాట్కు రూ. 7.9లక్షల వ్యయంలో అన్ని సదుపాయాలతో సొంతింటి కలను సాకారం చేసింది.
అప్పట్లో అన్నీ అవకతవకలే…
అప్పటి ప్రభుత్వాల ఘనకార్యాలను కళ్లారా చూసిన తెలంగాణ ప్రభుత్వం… ఎన్నికల హామీలోనే డబుల్ బెడ్రూం ఇండ్లను చేర్చింది. చెప్పింది చేస్తాం.. చేసేది చెబుతామంటూ దశల వారీగా అందిస్తోంది. కానీ గత ప్రభుత్వాల హయాంలో ఉచితం పేరిట జరిగిన మోసాలను తలుచుకుని కంటనీరు తెచ్చుకుంటున్నారు. స్థానిక చోటామోటా లీడర్ల నుంచి ఎంపిక చేసే ప్రజాప్రతినిధుల వరకు ఫలమో, పత్రమో ఇచ్చుకుంటే పక్కా ఇంటిని పొందలేని దుస్థితి ఉండేది. ఆనాటి ప్రభుత్వం ఉచితంగా ఇండ్లను పంపిణీ చేస్తామని హామీ ఇవ్వడంతో.. ఆశపడిన ఎంతోమంది పేదలు రూ. 40 వేలను జేఎన్ఎన్యూఆర్ఎం ఇండ్ల కోసం చెల్లించారు. దీనికి భారం కాకుండా ఉండేందుకు లోన్ సదుపాయం కల్పిస్తామని చెప్పి… ఉమ్మడి రాష్ట్రంలో గుదిబండను కట్టబెట్టి… 192 ఎస్ఎఫ్టీలో ఉండే సింగిల్ రూం ఇండ్లను అప్పగించారని అప్పట్లో జరిగిన మోసాన్ని గుర్తు చేసుకుని ఇప్పటికీ బాధపడుతున్నారు బండ్లగూడలోని ఓ లబ్ధిదారురాలు. కనీసం ఇంటికెళ్లేందుకు మెరుగైన రోడ్లు, మరుగుదొడ్లు లేకుండానే భవనాలను నిర్మించి ఇచ్చారని… బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లల్లో ఏర్పాటు చేసిన సదుపాయాలను చూసి ఆవేదనతో చెబుతున్నారు.
రాజీవ్ గృహకల్ప కంటే డబుల్ బెడ్ రూం అద్భుతం
డబుల్ బెడ్ రూం ఇండ్లకు.. రాజీవ్ గృహ కల్ప ఇండ్లకు అసలు పోలికే లేదు. వాటి కంటే సీఎం కేసీఆర్ సారు ఇచ్చిన డబుల్ బెడ్ రూం అద్భుతంగా ఉన్నవి. డబుల్ బెడ్రూం ఇంటిలో రెండు పడక గదులు, ఒక హాల్, ప్రత్యేక వంట గది, బట్టలు ఉతకడం కోసం ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేశారు. రెండు మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. కానీ రాజీవ్ గృహకల్ప ఇళ్లలో రెండు గదులు మాత్రమే ఉంటాయి. కిచెన్ ప్రత్యేకంగా ఉండదు. ఒకటే మరుగు దొడ్డి ఉంటుంది. మరుగు దొడ్డిలోనే బట్టలు ఉతకాలి, బాల్కనీ ఉండదు. డబుల్ బెడ్ రూం ఇండ్లతో లబ్ధిదారులకు రూపాయి ఖర్చు లేదు. అదే రాజీవ్ గృహకల్ప ఇల్లు అయితే గవర్నమెంట్ మధ్యవర్తిగా ఉండి ఇప్పించిన లోన్ను లబ్ధిదారుడు చెల్లించాలి. మాకు సొంతిళ్లు లేక కిరాయి ఇంట్లోనే ఉంటున్నాం. భర్త ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు.. వచ్చే జీతం సరిపోక ఇంటి కిరాయి కట్ట లేక అవస్తలు పడుతున్నాం. ఇలాంటి ఇబ్బందులు పడుతున్న సమయంలో డబుల్ బెడ్ రూం ఇల్లు వచ్చిందని, బహదూర్పల్లికి రావాలని ఫోన్ వచ్చింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ , ఎమ్మెల్యే కృష్ణారావు సార్ మాకు ఇంటి పట్టాను అందజేశారు. నాకు దుండిగల్ దగ్గర డి. పోచంపల్లిలో బ్లాక్ నంబర్ 7లో 8వ అంతస్తులో 1వ నంబర్ ఇంటి పట్టాను అందజేశారు. నాకు చాలా సంతోషం అనిపించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సారు 50 లక్షలు విలువ చేసే ఇళ్లు ఇచ్చి మా జీవితాల్లో వెలుగులు నింపిండు.
-గుబ్బల రాణి, బాలానగర్
రూపాయి ఖర్చు లేకుండా…
రూపాయి ఖర్చు లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వడం సంతోషంగా ఉంది. గతంలో ఉన్న ప్రభుత్వాలు ఇంటి స్థలాన్ని కేటాయించి నిర్మాణానికి లబ్ధిదారులకు లోన్లు ఇచ్చేవి. సదరు లోన్ల బకాయిలను లబ్ధిదారుడు చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. డబుల్ బెడ్ రూం ఇండ్ల విషయంలో స్థలాన్ని కేటాయించి నిర్మాణ పనులు కూడా పూర్తి చేసి లబ్ధిదారులకు ఇంటి పట్టాలు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ సార్కే సాధ్యమైంది. మాది ఏపీ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాకు చెందిన వాళ్లం. బతుకు దెరువు కోసం నగరానికి వచ్చి ఫిరోజ్గూడలో 25 ఏండ్లుగా కిరాయి ఇంటిలో ఉంటూ జీవితాలు వెళ్లదీస్తున్నాం. భర్త అప్పారావు సెంట్రింగ్ పని చేస్తున్నాడు. ఇద్దరు పిల్లలు. వచ్చిన డబ్బుతో పిల్లలను చదివించడం, ఇంటి కిరాయి కట్టడం ఇబ్బందిగా ఉంది. కొన్ని సార్లు కిరాయి కట్టలేక ఇబ్బందులు పడ్డాం. ఈ సమయంలో సీఎం కేసీఆర్ సార్ మాకు డబుల్ బెడ్ రూం ఇల్లు ఇచ్చి ఆదుకున్నడు. సీఎం కేసీఆర్ సార్ లాంటి నాయకులు ఉంటేనే మాలాంటి పేదోళ్లు బాగుపడుతరు. మాకు డబుల్ బెడ్ రూం ఇల్లు వచ్చిందని ఫోన్ రాగానే చాలా సంతోష పడ్డాం. కుటుంబంతో కలిసి బహదూర్పల్లికి వెళ్లాం. గండి మైసమ్మ చౌరస్తా దగ్గర డి. పోచంపల్లిలో ఇల్లు వచ్చింది. మంత్రి శ్రీనివాస్ , ఎమ్మెల్యే కృష్ణారావు సారు ఇంటి పట్టాను అందజేశారు. నాకు చాలా సంతోషంగా ఉంది.
– నర్సిపురం సావిత్రి, బాలానగర్
వాయిదాలు లేకుండా ఉచితంగా ఇల్లు..
ఎలాంటి నెలవారీ వాయిదాలు లేకుండా డబుల్ బెడ్రూం ఇంటిని సొంతం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. బతుకుదెరువు కోసం 20 ఏండ్ల క్రితం హైదరాబాద్కు వచ్చాం. శేరిలింగంపల్లిలోని హఫీజ్పేట్లో అద్దె ఇంట్లో ఉంటున్నాం. నేను స్థానికంగా ఉన్న అపార్టుమెంట్లోని ప్లాట్లలో వంటమనిషిగా, మా ఆయన శ్యామ్ ట్రాన్స్పోర్టు లేబర్గా పనిచేస్తున్నారు. మాకు ఇద్దరు పిల్లలు. ఇంటి అద్దె ప్రతి నెల 7 నుంచి 8 వేలు కిరాయి చెల్లిస్తున్నా. వచ్చిన సంపాదనంతా ఇంటి అద్దె, పిల్లల చదువుకు ఖర్చయ్యేది. 18 ఏండ్లుగా సొంతింటి కోసం ప్రభుత్వాలకు ఎన్నోసార్లు దరఖాస్తు చేశా. సీఎం కేసీఆర్ పాలనలో మాకు డబుల్ బెడ్రూం వచ్చింది. ఇటీవల కొల్లూరులో జరిగిన సభలో ఇంటి పత్రాన్ని అందుకున్నా. రెక్కాడితే గాని డొక్కాడని మాలాంటి పేదవాళ్లకు సొంతింటి కలను సాకారం చేసిన ఘనత కేసీఆర్కే దక్కింది.
– రేణుక, హాఫీజ్పేట్, శేరిలింగంపల్లి
ఎలాంటి చెల్లింపులు లేవు..
సొంతింటి కల నెరవేరడంతో సంతోషంగా ఉంది. ఇటీవల బీఆర్ఎస్ ప్రభుత్వం కొల్లూరులో డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చింది. గత ప్రభుత్వాలు కిస్తీలు కట్టించుకొని ఇల్లు ఇచ్చేవి. ఈ ప్రభుత్వం హయాంలో ఎలాంటి కిస్తులు, వాయిదాల చెల్లింపులు లేకుండా డబుల్ బెడ్రూం ఇళ్లు మా సొంతమైంది. శేరిలింగంపల్లి పీజేఆర్నగర్ ఎల్లమ్మబండలో అద్దె ఇంట్లో ఉంటున్నాం. నేను సాధారణ గృహిణి, మా భర్త ప్రింటింగ్ ప్రెస్లో హెల్పర్ గా పనిచేస్తున్నారు. ఎమ్మెల్యే గాంధీ సహకారంతో దరఖాస్తు చేసుకున్నా. ఇల్లు వచ్చింది. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే గాంధీ సారుకు కృతజ్ఞతలు. వాయిదాల బాధ లేకుండా సొంతింటి కల సాకారం కావడం సంతోషంగా ఉంది.
– డీ.జ్యోతి, ఎల్లమ్మబండ, పీజేఆర్నగర్
లోన్ కట్టేది ఉంది…
2007లో రూ. 30వేలు బ్యాంకులో కట్టి 38 గజాలు ఉన్న ఇంట్లోకి వచ్చాం. అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డి ఇల్లు ఇచ్చారు. బ్యాంకు వాళ్లు లక్ష రూపాయలు కడితే రిజిష్టర్ పేపర్లు ఇస్తామన్నారు. రూ. 30వేలు కట్టాం. నేను మా ఆయన కూలి పని చేసి జీవనం సాగిస్తున్నాం. వచ్చిన డబ్బులు ఖర్చులకే సరిపోతున్నాయి. డబ్బులు కట్టలేని పరిస్థితి. 3 సంవత్సరాల క్రితం డబ్బులు కట్టకపోతే ఇంటికి తాళాలు వేస్తామన్నారు. అనంతరం 50 వేలు కట్టాలని ఒత్తిడి తీసుకొచ్చారు. ప్రస్తుతం రూ. 20 వేలు కడితే చాలు ఇంటి రిజిష్టర్ పేపర్లు ఇస్తామంటున్నారు. మేము వచ్చినప్పుడు రోడ్లు లేకుండే. గత 5 సంవత్సరాల క్రితం రోడ్లు వేశారు.
– నర్సమ్మ, ఆల్మాస్గూడ, రాజీవ్ గృహకల్ప
అరకొర వసతులతోనే నెట్టుకొచ్చాం
2009లో అమ్మ పేరుతో ఇల్లు వచ్చింది. 30 గజాలు ఉంటుంది. ఇంట్లో 5 మంది ఉంటాం. మొదటి రూ. 1000 బ్యాంకులో డీడీ కట్టాం. తర్వాత 10వేలు, ఆ తర్వాత 70వేలు కట్టాం. మొదటి సెప్టిక్ ట్యాంకు ఉండేది. అన్ని చోట్ల రోడ్లు లేవు, కొన్ని చోట్ల మాత్రమే ఉండేవి. అరకొర వసతులతోనే ఇన్నాళ్లు నెట్టుకొచ్చాం. తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని రోడ్లను వేయించారు. సెప్టిక్ ట్యాంకులు అవసరం లేకుండా డ్రైనేజీ పైపులలో కలిపారు. గతంలో మిగతా డబ్బులు కట్టాలని బ్యాంకు వాళ్లు నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు అడగడం లేదు. గతంలో కరెంట్ సరిగా ఉండేది కాదు. ప్రస్తుతం నిరంతరం విద్యుత్ సరఫరా అవుతుంది. ఈ సంవత్సరంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి కొన్ని రోడ్లు అభివృద్ధి చేశారు. ప్రస్తుతం రాజీవ్ గృహకల్ప ప్రధాన రోడ్డు కూడా పాడైంది.
– రాము, ఆల్మాస్గూడ, రాజీవ్గృహకల్ప
స్వరాష్ట్రంలోనే ఇండ్లకు ప్రధాన రోడ్లు…
2008లో ఇంట్లోకి వచ్చాం. మూడు సార్లు మొత్తం 45 వేలు కట్టాను. మేము వచ్చినప్పుడు కాలనీలో రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేశారు. ఆల్మాస్గూడ నుంచి రాజీవ్ గృహకల్పకు 2 కిలోమీటర్లు ఉండేది. మట్టి రోడ్డు గుండా ప్రయాణం సాగించేవాళ్లం. ఎగుడు దిగుడుగా ఉన్న మట్టి రోడ్డుపై ఆటోలో, బస్సులో, బైక్పై ప్రయాణించాలంటే ఇబ్బంది పడేవాళ్లం. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రధాన రహదారిని బీటీ, సీసీ రోడ్డుగా అభివృద్ధి చేశారు. కొంత మేర రోడ్డు సమస్యలు ఉన్నాయి. అప్పడప్పుడు డ్రైనేజీ సమస్యలు వస్తున్నాయి. ఇంటిలోన్ కట్టాలని బ్యాంకు వాళ్లు నోటీసులు ఇస్తున్నారు.
– స్వప్న, రాజీవ్ గృహకల్ప