నగర నడిబొడ్డున పచ్చని చెట్లు, అరుదైన వన్యప్రాణాలతో అలరారే కేబీఆర్ పార్క్ ఇప్పుడు కాంక్రీట్ కట్టడాల ముప్పును ఎదుర్కొంటున్నది. అభివృద్ధి అనే మసుగులో పార్క్ సహజసిద్ధమైన అటవీ రూపురేఖలను ప్రభుత్వం మార్చేస్తున్నది. దీనిపై నగరవాసులు, ప్రకృతి ప్రేమికులు, స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పార్క్ చుట్టూ ఉన్న ఇనుప కంచెను తొలగించి గోడలు కట్టడం, వాకింగ్ ట్రాక్ కోసం చెట్లను నరికివేయడం, వంటి చర్యలు వివాదాలు చెలరేగుతున్నాయి. పార్క్ లోపలికి జిమ్లూ, పార్కింగ్ బేలు, కాంక్రీట్ రోడ్లను తీసుకురావడంతో అసలు పార్క్ స్వరూపమే కనిపించడం లేదని, ఇక్కడి ఏకో సిస్టం పూర్తిగా దెబ్బతింటోందని వాకర్స్ మండిపడుతున్నారు.
కోర్ ఏరియా క్రమంగా..
దేశంలోనే ప్రధాన జాతీయ పార్కుల్లో ఒకటిగా ఉన్న కేబీఆర్ పార్క్ కోర్ ఏరియా క్రమంగా కనుమరుగైపోతున్నది. గత కొంతకాలంగా జరుగుతున్న మార్పులు పార్క్ను అటవీ ప్రాంతంలా కాకుండా పబ్లిక్ పార్క్లా మారుస్తున్నారనే వాదనలు ఉన్నాయి. ఇటీవల కాలంలో ప్రభుత్వం ఏకో సెన్సిటివ్ జోన్ పరిధిలో భారీ కట్టడాలకు పూనుకున్నది. పార్క్ చుట్టూ ఉన్న ఇనుప కంచెను తొలగించి, గోడలు కట్టడం, వాకింగ్ ట్రాక్ కోసం చెట్లను నరికివేయడం వంటి చర్యలతో కేబీఆర్ పార్క్ పర్యావరణ పరిరక్షణ లేకుం డా పోతున్నది. ఇప్పటికే సర్కారు చర్యలు వివాదాస్పదంగా మారగా, అభివృద్ధి పేరిట సర్కారు చేస్తున్న విధ్వంసంతో వాకర్స్ , స్థానికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
ప్రణాళికాబద్ధమైన విధ్వంసం…
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ సరిహద్దులో ఉన్న కేబీఆర్ నేషనల్ పార్క్ ప్రధాన ద్వారం నుంచి లోపలికి వెళ్లే మార్గాల్లో ఈ మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చిరాన్కుంట పరిసరాలు, ఎంట్రన్స్ గేట్ వద్ద పార్కిం గ్ సౌకర్యాలు అటవీ విస్తీర్ణాన్ని కబళిస్తున్నాయి. 2000 సంవత్సరం నుంచే క్రమంగా పార్క్ లోపలికి మనుషుల ప్రవేశం, ఫీజుల వసూలు మొదలైంది. అప్పటి నుంచి స్వరూపాన్ని దెబ్బతీసేలా సాగుతున్న ప్రణాళికాబద్ధమైన చర్యలతో జాతీయ పార్క్ మనుగడపై ప్రభావం పడుతున్నది. ముఖ్యంగా జూ అండ్ పార్క్ అథారిటీ ఆప్ తెలంగాణ, అటవీ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులపై వాకర్స్ అసోసియేషన్ ధ్వజమెత్తుతున్నారు.
నడక కష్టమైపోతోంది..
కేవలం బ్యూటిఫికేషన్ పేరిట అటవీ ప్రాంతానికి ముప్పు తీసుకువస్తున్న యం త్రాంగం… చివరకు వన్యప్రాణుల సంరక్షణ కోసం ఖర్చు చేయాల్సిన నిధులను జిమ్ పరికరాలు, కాంక్రీట్ దారుల కోసం ఖర్చు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అటవీ శాఖ నిబంధనలు కాలరాస్తూ, పార్క్ సరిహద్దులను లోపలికి జరపడంతో వాకింగ్ ట్రాక్ వెడల్పు చేశారు. కానీ ఏండ్ల నాటి చెట్లను కొట్టివేశారు. నగరానికి ప్రాణవాయువును అందించే కేబీఆర్ పార్క్ విధ్వంసంతో వన్యప్రాణులు, వృక్ష సంపదతో పాటుగా వాకర్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు. వన్యప్రాణుల మనుగడకు ముప్పు వాటిల్లుతోంది. జాతీయ పార్క్ లోపల లైట్లు, యం త్రాల శబ్ధం పెరగడంతో నెమళ్లు, అడవి పిల్లు లు వంటి వన్యప్రాణులు తమ ఆవాసాన్ని కోల్పోతున్నాయి.రంగులు మార్చితే కాంక్రీటు నిర్మాణం వల్ల అభివృద్ధి జరగదని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందిం చి పార్క్ వైల్డ్ కోర్ జోన్ను కాపాడాల్సిన అవసరం ఉందంటున్నారు.
హెచ్ఆర్సీకి ఫిర్యాదు
సిటీబ్యూరో, మే 6(నమస్తే తెలంగాణ) : పర్యావరణపరంగా అత్యంత సున్నితమైన కేబీఆర్ జాతీయ పార్క్ విధ్వంసంపై ప్రముఖ న్యాయవాది ఇమ్మానేని రామారావు హెచ్ఆర్సీని ఆశ్రయించగా, కేసు నమోదు చేసినట్లు తెలిపారు. తెలంగాణ సీఎస్ రామకృష్ణరావుపై విచారణకు ఆదేశించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. చిరాన్కుంట చెరువు కాలుష్యం, ఏకో సిస్టంకు తీరని ప్రమాదం ఉందని, పర్యావరణ చట్టాలు కాలరాస్తూ..జరుగుతున్న విధ్వంసాన్ని హెచ్ఆర్సీకి వివరించారు. కోర్టు ఆదేశాలనుఉల్లంఘిస్తున్న తీరును ఫిర్యాదులో పేర్కొన్నారు. చెట్ల తరలింపు, డీఫారెస్టేషన్ వంటి చర్యలను తక్షణమే నిలిపివేయాలనిహెచ్ఆర్సీని కోరారు.