Hyderabad | బంజారాహిల్స్, జూలై 12: బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్కు వాక్వేలో కమ్యూనిటీ సీసీ కెమెరా ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేసిన 156 సీసీ కెమెరాలను గురువారం నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రారంభించనున్నారు. కేబీఆర్ పార్కు బయట సుమారు 5 కిలోమీటర్ల మేర ఉన్న జీహెచ్ఎంసీ వాక్వేలో నిత్యం వేలాదిమంది వాకర్లు నడక సాగిస్తుంటారు. వారి భద్రత కోసం గతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పాడైపోవడంతో అసాంఘిక శక్తులను కట్టడి చేయడం కష్టంగా మారింది. వాకింగ్ చేయడానికి వచ్చే మహిళలపై ఆకతాయిలు వేధింపులకు పాల్పడిన ఘటనలు చోటు చేసుకోవడంతో సీసీ కెమెరాల ఏర్పాటుపై బంజారాహిల్స్ పోలీసులు దృష్టి పెట్టారు. నగర పోలీస్ శాఖ చేపట్టిన కమ్యూనిటీ సీసీ కెమెరా ప్రాజెక్టులో భాగంగా దాతలను కలిసిన బంజారాహిల్స్ పోలీసులు సీసీ కెమెరాల ఏర్పాటు కోసం విరాళాలను సేకరించారు.
కొన్ని వ్యాపార సంస్థలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్)లో భాగంగా కొంత మేర నిధులు సమకూర్చాయి. దీంతో సుమారు రూ.80లక్షల వ్యయంతో 156 ఐపీ బేస్డ్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. నైట్ విజన్తో పాటు హైడెన్సిటీ కెమెరాలను కేబీఆర్ వాక్వేలో ఏర్పాటు చేశామని బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ నరేందర్ తెలిపారు. సీసీ కెమెరాలకు సంబంధించిన కంట్రోల్ రూమ్ను కేబీఆర్ పార్కులోనే ఏర్పాటు చేశామని, దీంతోపాటు బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లోని కమాండ్ కంట్రోల్తో కూడా వీటిని అనుసంధానం చేసినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. కేబీఆర్ పార్కుకు వాకింగ్ కోసం వచ్చేవారితో పాటు సందర్శకుల భద్రత కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు.