హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కరాచీ బేకరికి భారీ జరిమానా విధించింది. ఆ బేకరి విక్రయించిన స్వీట్లో ఫంగస్ బయటపడటంతో రూ. 10 వేల జరిమానా విధించినట్లు జీహెచ్ఎంసీ తెలిపింది.
శనివారం రోజు ఖాజాగూడలోని కరాచీ బేకరిలో కొనుగోలు చేసిన స్వీట్లో ఫంగస్ ఉందని తెలుపుతూ.. సామాజిక కార్యకర్త శ్రీనివాస్ రావు ఆ ఫోటోలను తన ట్వీట్లో షేర్ చేశారు. ఈ ఫోటోలను మంత్రి కేటీఆర్, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్కు శ్రీనివాస్ రావు ట్యాగ్ చేశారు. దీనిపై వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించారు.
సర్కిల్ అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ కేఎస్ రవి, ఫుడ్ కాంటమినేషన్ కంట్రోల్ ఆఫీసర్ సూర్య కలిసి కరాచీ బేకరిని తనిఖీ చేశారు. అక్కడ పరిశుభ్రత లోపించడంపై నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యర్థాలను అక్కడే పడేయడం, ప్లాస్టిక్ వినియోగించడం, డ్రైనేజీ సిస్టం సరిగా లేకపోవడంతో అధికారులు మండిపడ్డారు. కొవిడ్ నిబంధనలు ఏ మాత్రం పాటించడం లేదని బేకరి యాజమాన్యంపై ఆగ్రహం వెలిబుచ్చారు. కస్టమర్కు ఫంగస్ ఏర్పడిన స్వీట్ను ఎలా విక్రయిస్తారని, పరిశుభ్రత ఎందుకు పాటించడం లేదని అధికారులు ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. మొత్తంగా బేకరికి రూ. 10 వేల జరిమానా విధించారు.