సిటీబ్యూరో/కాప్రా, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ వ్యాప్తంగా ఉన్న చెరువుల సుందరీకరణ పనులను వివిధ శాఖల సమన్వయంతో చేపడుతున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. ఎల్బీనగర్ జోన్ కాప్రా సరిల్లోని కాప్రా చెరువును కమిషనర్ మంగళవారం సందర్శించారు. చెరువుల అభివృద్ధి, పరిరక్షణకు జీహెచ్ఎంసీ, ఇరిగేషన్, లేక్స్, టౌన్ ప్లానింగ్, యూబీడీ, శానిటేషన్ విభాగాలు సంయుక్తంగా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు. కాప్రా చెరువును స్థానిక ప్రజల విజ్ఞప్తి మేరకు అభివృద్ధి పరచడం, అక్రమంగా చేపలు పట్టడం, లికర్ సేవించడం, వంటి అసాంఘిక కార్యక్రమాలు అరికట్టడానికి చెరువుల వద్ద 24 గంటలు సెక్యూరిటీ, లేక్ ప్రొటెక్షన్ గ్రూపులను నియమించామన్నారు.
చెరువుల సుందరీకరణలో భాగంగా వాకింగ్ ట్రాక్ ఫెన్సింగ్, అర్బన్ బయోడైవర్సిటీ ద్వారా ప్లాంటేషన్ డ్రైవ్ను చేపట్టామన్నారు. సీసీ కెమెరాలు, పోలీస్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామన్నారు. స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం పనులను చెరువులకు అనుసంధానం చేస్తున్నామన్నారు. కాప్రా చెరువును నాలుగు సెగ్మెంట్లుగా విభజించి వేగవంతంగా పనులు పూర్తి చేస్తున్నామని తెలిపారు. శానిటేషన్ ద్వారా చెరువులో క్లీనింగ్ చేయడం జరిగిందన్నారు. సీ అండ్ డీ వేస్ట్ మెటీరియల్ను పూర్తిగా క్లీనింగ్ చేస్తున్నామన్నారు. సమావేశంలో జో నల్ కమిషనర్ పంకజ, డీసీ ముకుంద్, ఇరిగేషన్ ఈ ఈ నారాయణ, సీఈ లేక్స్ సురేశ్, టౌన్ ప్లానింగ్ సిటీ ప్లానర్ ప్రసాద్ పాల్గొన్నారు.