సిటీబ్యూరో, జనవరి 16 (నమస్తే తెలంగాణ): కంటి వెలుగుకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 19న గ్రేటర్ వ్యాప్తంగా కంటివెలుగు శిబిరాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు చెందిన అధికార యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఇప్పటికే అన్ని కేంద్రాలకు కంటి పరీక్షల యంత్రాలను తరలించిన అధికారులు కంటి అద్దాలు, మందులను చేరవేశారు. మూడు జిల్లాల పరిధిలో మొత్తం 274 బృందాలతో 2556 ప్రాంతాల్లో శిబిరాలను ఏర్పాటు చేసేందుకు జీహెచ్ఎంసీ ప్రణాళికలు రూపొందించింది. ఇప్పటికే 274 కంటివెలుగు కేంద్రాలకు 3,81,445 రీడింగ్ గ్లాసెస్ను చేరవేసినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. ఒక్కో సెంటర్కు ఒక్కో బృందం చొప్పున మొత్తం 274సెంటర్లలో 274బృందాలు కంటివెలుగు కార్యక్రమంలో విధులు నిర్వహించనున్నాయి. ఒక్కో బృందంలో మెడికల్ ఆఫీసర్ సహా మొత్తం 8మంది చొప్పున విధులు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. కంటి వెలుగుకు సంబంధించి గ్రేటర్ వ్యాప్తంగా నేటి నుంచి ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
హైదరాబాద్ జిల్లా పరిధిలో..
నగరంలో మొత్తం 115 కేంద్రాలు ఏర్పాటుగా చేయగా 115 బృందాలు కంటివెలుగు విధులు నిర్వహిస్తాయని హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జె.వెంకటి వెల్లడించారు. నగర పరిధిలో మొత్తం 1110 ప్రాంతాలను గుర్తించామని, అయా ప్రాంతాల్లో షెడ్యూల్ ప్రకారం శిబిరాలను నిర్వహిస్తామని తెలిపారు. ఇప్పటికే 1,72,420 రీడింగ్ గ్లాసెస్ అందాయని వాటిని అన్ని కంటివెలుగు కేంద్రాలకు పంపిణీ చేసినట్లు వివరించారు. 115బృందాలకు అదనంగా మరో 6 బఫర్ టీమ్స్ కూడా పని చేస్తాయన్నారు. ఒక్కో బృందం ప్రతి రోజు కనీసం 135 మందికి కంటి పరీక్షలు, వైద్యం చేస్తాయని తెలిపారు.
రంగారెడ్డిలో..
జిల్లా పరిధిలో మొత్తం 965 ప్రాంతాలను కంటి వెలుగు కోసం గుర్తించామని, ఇందులో 558 కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో, 49 కేంద్రాలు జీహెచ్ఎంసీ, మిగిలిన కేంద్రాలు అర్బన్ ఏరియాలో ఉన్నాయని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. మొతం 80 బృందాలతో నిర్వహించనున్న కంటివెలుగు కార్యక్రమంలో ఒక్కో బృందం ద్వారా ప్రతి రోజు పట్టణ ప్రాంతాల్లో 400 మందికి, గ్రామీణ ప్రాంతాల్లో 300 మందికి చొప్పున కంటి పరీక్షలు, చికిత్స అందించే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లాకు మొత్తం 1,04,000 రీడింగ్ గ్లాసెస్ వచ్చాయని, వాటిని ఆయా కేంద్రాలకు పంపిణీ చేసినట్లు వివరించారు.
మేడ్చల్లో..
జిల్లా పరిధిలో మొత్తం 481ప్రాంతాలను గుర్తించామని, జిల్లావ్యాప్తంగా మొత్తం 79కంటి వెలుగు బృందాలు, 4బఫర్ టీమ్స్ పనిచేయనున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ వెల్లడించారు. ప్రతి రోజు ఒక్కో బృందం కనీసం 130 నుంచి 140 మందికి సేవలు అందించే విధంగా ఏర్పాటు చేశామన్నారు. జిల్లాకు మొత్తం 1,05,02 5రీడింగ్ గ్లాసెస్ అందాయని వాటిని అన్ని కేంద్రాలకు పంపిణీ చేశామన్నారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకు పరీక్షలు..
గ్రేటర్ పరిధిలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కంటి వెలుగు శిబిరాలు పని చేస్తాయని వైద్యాధికారులు వెల్లడించారు. ప్రతిరోజు నిర్ణీత కేంద్రాల్లో ప్రణాళిక ప్రకారం స్థానికులకు కంటి పరీక్షలు నిర్వహిస్తారని, రీడింగ్ గ్లాసెస్ అవసరమున్న వారికి అప్పటికప్పుడే అందిస్తారని తెలిపారు. చూపు సమస్య ఉన్న వారికి మాత్రం 15 రోజుల్లో అద్దాలను ఇంటి వద్దనే ఇస్తామని అధికారులు వివరించారు.
ప్రతి ఇంటికి.. కంటి వెలుగు ఆహ్వానం
ప్రతి ఇంటికి కంటి వెలుగు ఆహ్వాన పత్రికలను అందజేయాలని కలెక్టర్ హరీశ్ అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో సోమవారం జిల్లా అధికారులతో కలెక్టర్ హరీశ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 480 లోకేషన్లు, 79 బృందాలతో 27,51,810 మందికి తప్పకుండా కంటి పరీక్షలు నిర్వహించాలన్నారు. కంటి వెలుగు పరీక్షలకు వచ్చేవారు తప్పకుండా ఆధార్కార్డును వెంట తీసుకరావాలన్నారు. క్యాంపుల నిర్వహణ షెడ్యూల్ను అధికారులు ప్రజాప్రతినిధులకు అందజేయాలని, ఈనెల 17 న ప్రతి క్యాంపు ప్రదేశంలో ట్రయల్న్ నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ నెల 19 నుంచి జిల్లాలో ప్రారంభం అవుతుందని, షెడ్యూల్ ప్రకారం జరిగే క్యాంపులకు విద్యుత్, పోలీసు సిబ్బంది సహకరించాలని కోరారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య, డీసీపీ సందీప్, జిల్లా వైద్యాధికారి పుట్ల శ్రీనివాస్, సీఈవో దేవసహాయం, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారిణి పద్మజారాణి, జిల్లా పంచాయతీ అధికారి రమణమూర్తి, మున్సిపల్ కమిషనర్లు, వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, సీఎస్ శాంతి కుమారిలు బీఆర్కే భవన్ను నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ హరీశ్ పాల్గొన్నారు.