సిటీబ్యూరో, మార్చి 15 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్లో కంటివెలుగు 38వ రోజుకు చేరుకున్నది. ఇప్పటివరకు 4,16,379 మందికి కంటి పరీక్షలు చేయించుకున్నారని హైదరాబాద్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటి తెలిపారు. బుధవారం భోలక్పూర్ డివిజన్లోని పద్మశాలీ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని ఎస్పీహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ, మెడికల్ ఆఫీసర్ శృతిలతో కలిసి ప్రారంభించారు. హైదరాబాద్ జిల్లాలో బుధవారం 9950 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా వారిలో 2600 మందికి రీడింగ్ గ్లాసెస్ను పంపిణీ చేయగా.. 1101 మందికి ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్ను సిఫారసు చేసినట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో 9551 మందికి కంటి పరీక్షలు జరిపి 1073మందికి రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేయగా, 822 మందికి ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్ను సిఫారసు చేశామన్నారు. మేడ్చల్ జిల్లా పరిధిలో 9330 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా 1269 మందికి రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేయగా.., 553 మందికి ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్ను సిఫారసు చేసినట్లు తెలిపారు.
కంటి వెలుగు కేంద్రాన్ని ప్రారంభించిన మేయర్
బంజారాహిల్స్, మార్చి 15 :ప్రజలందరూ కంటి వెలుగు శిబిరాలను వినియోగించుకోవాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 13లోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో శ్రీరాంనగర్ బస్తీ ప్రజల కోసం ఏర్పాటు చేసిన కంటి వెలుగు కేంద్రాన్ని బుధవారం మేయర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీహెచ్వో డా.అనురాధ, జీహెచ్ఎంసీ సర్కిల్ 18 ఏఎంవోహెచ్ డా.ప్రవీణతో పాటు స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.