ఖైరతాబాద్, డిసెంబర్ 4: హైదరాబాద్ ప్రెస్క్లబ్, జీవశ్రీ ఆయుర్వేదిక్ వెల్నెస్ సెంటర్ సంయుక్తాధ్వర్యంలో సోమాజీగూడ ప్రెస్క్లబ్ ఆవరణలో ఆదివారం నిర్వహించిన జర్నలిస్టుల ఉచిత ఆరోగ్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ శిబిరాన్ని తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ పి. జగన్ మోహన్ రావు, జీవశ్రీ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు ఫణిశ్రీ, ప్రెస్క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎల్. వేణుగోపాల్నాయుడు, రవికాంత్ రెడ్డి, కోశాధికారి ఎ. రాజేశ్, సంయుక్త కార్యదర్శి చిలుకూరి హరిప్రసాద్తో కలిసి ప్రారంభించారు.
శిబిరాన్ని సందర్శించిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి వైద్య పరీక్షలు చేయించుకొని వైద్య సేవలను పర్యవేక్షించారు. ఈ శిబిరంలో జీవశ్రీ వైద్యులు డాక్టర్ సత్యదీప, కల్పన, సునీత గ్రేస్, హరికుమార్ సహా 25 మంది వైద్యుల బృందం 400 మంది జర్నలిస్టుల కుటుంబాలకు వైద్య పరీక్షలు నిర్వహించి నెలకు సరిపడా మందులను ఉచితంగా అందజేశారు.
ప్రెస్క్లబ్ హైదరాబాద్ యూట్యూబ్ చానెల్ ప్రారంభం
ప్రెస్క్లబ్ హైదరాబాద్ యూట్యూబ్ చానెల్ను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆదివారం సోమాజీగూడ ప్రెస్క్లబ్లో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎల్. వేణుగోపాలనాయుడు, ఆర్. రవికాంత్ రెడ్డి, కోశాధికారి ఎ. రాజేశ్, సంయుక్త కార్యదర్శి చిలుకూరి హరిప్రసాద్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రజల గొంతుకగా ఉన్న జర్నలిస్టులు సేదతీరేందుకు ఒక చక్కటి వేదిక ప్రెస్క్లబ్ అన్నారు. క్లబ్లో ప్రతి రోజు జరిగే ప్రెస్మీట్స్, సభలు, సమావేశాలు, రౌండ్ టేబుల్ సమావేశాలు, చర్చా గోష్టి ఈ యూట్యూబ్ చానెల్లో అందుబాటులో ఉంచడం అభినందనీయమన్నారు. నూతన పాలక మండలి చేసే ప్రతి కార్యక్రమానికి తన వంతు సంపూర్ణ మద్దతు, సహకారం ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు. ప్రెస్క్లబ్లో ఓపెన్ జిమ్ను త్వరలోనే నెలకొల్పుతామని మేయర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాలలో ప్రెస్క్లబ్ కార్యవర్గ సభ్యులు ఎ. పద్మావతి, ఉమాదేవి, బి. గోపరాజు, వి. బాపూరావు, టి. శ్రీనివాస్, వసంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.