మేడ్చల్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉండటంతో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో పార్టీ అభ్యర్థులు నిర్వహిస్తున్న ప్రచారానికి విశేష స్పందన లభిస్తున్నది. దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం కనపడుతోంది. జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులైన మల్లారెడ్డి, కేపీ వివేకానంద్, మాధవరం కృష్ణారావు, మర్రి రాజశేఖర్రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి ఇప్పటికే సభలు, సమావేశాలు నిర్వహిస్తూనే ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టోకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో పార్టీ అభ్యర్థులకు ప్రజలు మద్దతు తెలుపుతున్నారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రచారాన్ని మరింత రెట్టింపు ఉత్సాహంతో నిర్వహిస్తున్నారు.
ఇందుకు భిన్నంగా జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి నెలకొంది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరిని ప్రకటించినప్పటికీ ప్రచారం మాత్రం అంతంత మాత్రంగా సాగుతోంది. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నిరుత్సాహం ఏర్పడింది. అభ్యర్థులను ప్రకటించిన ప్రతి నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలు మరింత రాజుకుని ఆ పార్టీ టికెట్ ఆశించిన అభ్యర్థులతో పాటు ముఖ్య నాయకులందరూ రాజీనామా చేసిన విషయం విధితమే. నామినేషన్ల గడువు సమీపిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు గ్రూప్ రాజకీయాలు సద్దుమనగలేదు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు గురవుతున్నారు. ఇదే పరిస్థితి ఉంటే ఆ పార్టీకి గడ్డుకాలమేనని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం కేసీఆర్పై ఉన్న నమ్మకంతో బీఆర్ఎస్ పార్టీలో జోరుగా చేరికలు జరుగుతున్నాయి. మేడ్చల్ నియోజకవర్గంలోని శామీర్పేట్ మండలం తుర్కపల్లి గ్రామం బీజేపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు బోయిన్పల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి మల్లారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. బీజేపీ నుంచి బీఆర్ఎస్లో చేరిన వారిలో వరప్రసాద్రెడ్డి, రవుఫ్, ప్రసాద్, మధుసూదన్, 30 మంది కార్యకర్తలు ఉన్నారు. అలాగే నాగారం మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 500 మంది మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.