సిటీబ్యూరో, సెప్టెంబర్ 17(నమస్తే తెలంగాణ): ఇంటర్నెట్ నుంచి డేటా సేకరిస్తూ, ఇన్సూరెన్స్ పేరుతో అమాయకులకు ఫోన్ చేసి మోసాలకు పాల్పడుతున్న నకిలీ ఇన్సూరెన్స్ కాల్సెంటర్పై హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు ఢిల్లీలో దాడి చేసి నిర్వాహకులలో నలుగురిని అరెస్ట్ చేశారు. 85 మంది టెలీకాలర్స్కు 41(ఎ) నోటీసులు జారీ చేశారు. ఆదివారం సీసీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాయింట్ సీపీ గజారావు భూపాల్, డీసీపీ కవితి, ఏసీపీ శివమారుతీతో కలిసి వివరాలు వెల్లడించారు. నగరానికి చెందిన ఓ రిటైర్డు ఉద్యోగికి తాము పీఎన్బీ మెటా లైఫ్ ఇన్సూరెన్స్, భారతి ఎక్సా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి మాట్లాతున్నామంటూ ఫోన్ చేశారు. మీ పాలసీ రెండేండ్లలోనే మెచూరిటీ అవుతున్నది.. ఇప్పుడే మీరు ైక్లెయిమ్ చేసుకుంటే రూ.1.7కోట్లు వస్తాయంటూ నమ్మించారు. అందుకు ముందుగా వివిధ ఫీజులు చెల్లించాలంటూ నమ్మిస్తూ రూ.45,78,760 దఫదఫాలుగా దోచేశారు. దీనిపై బాధితురాలు సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కస్టమర్ కేర్ పేరుతో ఫోన్ చేసి మోసం చేసినట్లు కేసు నమోదు చేసి, ఇన్స్పెక్టర్ ప్రసాద్రావు నేతృత్వంలోని బృందం దర్యాప్తు ప్రారంభించింది.
ఢిల్లీ కాల్ సెంటర్…
దర్యాప్తులో ఢిల్లీ నుంచి మోసం జరిగినట్లు గుర్తించిన అధికారులు ఆధారాలతో ప్రత్యేక బృందం అక్కడికి వెళ్లింది. ఢిల్లీలో ‘హెచ్డబ్ల్యూ ఔట్సోర్సింగ్ అండ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో కాల్ సెంటర్ నిర్వహిస్తున్నారు. ఇంటర్నెట్తో పాటు వివిధ మార్గాల నుంచి ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్న వారి వివరాలు తీసుకుంటున్నారు. ఫోన్ చేసి కస్టమర్స్ను నిజమైన కంపెనీ కస్టమర్ కేర్ ప్రతినిధులుగా ఎలా నమ్మించాలనే అంశంపై శిక్షణ ఇస్తారు. శిక్షణ పొందిన టెలీ కాలర్స్కు రోజు కొంత మంది పేర్లు ఇచ్చి వారికి ఫోన్లు చేయిస్తారు. కొన్ని సందర్భాల్లో బయట నుంచి ఇన్సూరెన్స్ పాలసీ హోల్డర్ల డేటాను టెలీకాలర్స్కు అందిస్తుండగా, మరికొన్ని సందర్భాల్లో పేరు, ఫోన్ నంబర్ ఆధారంగానే టెలీ కాలర్స్ కస్టమర్లకు ఫోన్ చేసి స్వయంగా వారి నుంచే పాలసీల వివరాలు సేకరిస్తున్నారు. మొదట పేరు, ఫోన్ నంబర్ ఆధారంగా ఫోన్ చేసి వ్యక్తిగత వివరాలు సేకరించి, వాటి ఆధారంగా ఇన్సూరెన్స్ పాలసీల వివరాలు సేకరిస్తారు. ఇలా పాలసీ మెచూరిటీకి దగ్గర ఉన్న వాళ్లకు ఇప్పుడే ఎక్కువ డబ్బు వస్తుందని ఆశ చూపుతారు, మధ్యలో ఉన్న వారికి మీరు ప్రస్తుతం కంటే ప్రీమియంతోనే మరిన్ని సదుపాయాలు మీ పాలసీలో అందుబాటులో ఉన్నాయి… అప్డేట్ చేయమంటారా? అంటూ వారి నుంచి డబ్బులు వసూలు చేస్తారు.
టాప్అప్, ప్రీ మెచూరిటీ సెటిల్మెంట్ కొరకు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజులంటూ స్టాంప్ పేపర్స్, సెంట్రల్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్, ట్రాన్స్ఫర్ ఫీ, ప్రాసెసింగ్ ఫీ, ఎఫ్డీ అకౌంట్ ఓపెనింగ్ అంటూ రకరకాల పేర్లతో డబ్బులు వివిధ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయిస్తుంటారు. అనుమానం వచ్చిన వారికి మీరు చెల్లించే డబ్బంతా తిరిగి మీకు వచ్చేస్తుందంటూ నమ్మిస్తుంటారు. ఇలా ఒక్కో టెలీకాలర్కు నిర్వాహకులు టార్గెట్ ఇస్తూ దేశ వ్యాప్తంగా అమాయకులను మోసం చేస్తున్నారు. కాల్సెంటర్ నిర్వాహకులైన నలుగురు రమేంద్రకుమార్(కాల్సెంటర్ సీనియర్ మేనేజర్), సునీల్(మేనేజర్), రిషబ్ తివారీ(అసిస్టెంట్ మేనేజర్), కవి ప్రకాశ్(టీమ్ లీడర్)ను అరెస్ట్ చేశారు. 85 మంది టెలీకాలర్స్కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. నిందితుల నుంచి రెండు ల్యాప్టాప్లు, 40 మొబైల్ ఫోన్లు, మూడు వాకీ టాకీలు, పలువురి కస్టమర్ల వివరాలున్న నోట్బుక్స్, పాలసీ హోల్డర్ల డేటా షీట్స్ను స్వాధీనం చేసుకున్నట్లు జాయింట్ సీపీ వివరించారు. ఇన్సూరెన్స్ కంపెనీలు, బ్యాంకుల కస్టమర్ కేర్ సెంటర్ల నుంచి ఫోన్లు వస్తే టోల్ఫ్రీ నంబర్, ల్యాండ్లైన్ల నుంచి వస్తాయని, అలా కాకుండా సెల్ఫోన్లు, విదేశీ నంబర్లతో వచ్చే ఫోన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మొద్దని జాయింట్ సీపీ తెలిపారు. డబ్బులు డిపాజిట్ చేయమన్నారంటే ముందుగా అనుమానించి, ఆయా బ్యాంకులకు వెళ్లి నిర్ధారించుకోవాలని సూచించారు.