ఆర్కేపురం, ఫిబ్రవరి 11: నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. శనివారం సరూర్నగర్ ఇండోర్ స్టేడియం ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహంచిన మెగా జాబ్మేళా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మారిన పరిస్థితులకనుగుణంగా భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తేనే నగరాల్లో జీవించగల్గుతారన్నారు. నిరుద్యోగులకు జాబ్మేళాలు ఎంతో ఉపయోగంగా ఉంటాయన్నారు. ప్రభుత్వం అందించే ప్రతి అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు.
భవిష్యత్లో మూగ, చెవిటి, దివ్యాంగులకు ప్రత్యేక జాబ్మేళాను నిర్వహిస్తామని ప్రకటించారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని యువతీయువకుల కోసం ఈ జాబ్మేళాను నిర్వహించామని తెలిపారు. 130 కంపెనీలు ముందుకొచ్చి యువతకు ఉద్యోగాలు ఇవ్వడం అభినందనీయమన్నారు. 13 వేల ఉద్యోగాలకు 30 వేల మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారని అన్నారు.
ఈ మేళాలో అమ్మాయిలే అధిక అవకాశాలు అందుకున్నారని.. అత్యధిక జీతం రూ.40 వేలు అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. త్వరలో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి విందు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ఎగ్గె మల్లేశం, దయానంద్ గుప్తా, సెట్విన్ ఎండీ వేణుగోపాల్, కర్మన్ఘాట్ హనుమాన్ టెంపుల్ చైర్మన్ ఈశ్వరమ్మ యాదవ్, మాజీ కార్పొరేటర్లు, పలు డివిజన్ల బీఆర్ఎస్ అధ్యక్షులు, మాజీ మాజీ అధ్యక్షులు, ఉద్యమకారులు, మహిళలు, అధికారులు పాల్గొన్నారు.