కేపీహెచ్బీ కాలనీ, ఏప్రిల్ 26 : వర్సిటీలో నేర్చుకున్న పరిజ్ఞానంతో సమాజానికి ఉపయోగపడే పరిశోధనల వైపు దృష్టిసారించాలని జేఎన్టీయూహెచ్ వైస్ చాన్స్లర్ కట్టా నరసింహారెడ్డి అన్నారు. బుధవారం వర్సిటీ జేఎన్ ఆడిటోరియంలో టెక్నికల్ ఫెస్ట్ 2023 ప్రారంభోత్సవంలో వీసీ కట్టా నరసింహారెడ్డి, రిజిస్ట్రార్ ఎం.మంజూర్ హుస్సేన్, ముఖ్య అతిథి వీసీ ఎల్.ఎస్.గణేశ్, కళాశాల ప్రిన్సిపాల్ జయలక్ష్మి, వైస్ ప్రిన్సిపాల్ జి.వి.నర్సింహారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టెక్నాలజీ విద్యను అందించడంలో జేఎన్టీయూహెచ్కు ప్రత్యేక స్థానముందని.. ఈ వర్సిటీలో చదివిన విద్యార్థులు సమాజానికి ఉపయోగపడేలా పరిశోధనలు చేయాలన్నారు. నైపుణ్యాలు ఉంటే అన్ని ఇంజినీరింగ్ కోర్సుల విద్యార్థులకు మంచి అవకాశాలు లభిస్తాయన్నారు. ఉద్యోగాలు పొందడమే కాదు.. ఉద్యోగాలు సృష్టిచేలా ఎదగాలన్నారు. యేడాది కాలంలో నేర్చుకున్న పరిజ్ఞానంతో ఆవిష్కరణలు చేపట్టాలని ఆ పరిజ్ఞానాన్ని తోటి విద్యార్థులకు అందించాలని సూచించారు. టెక్నికల్ ఫెస్ట్కు అన్ని రకాల సహాయ సహకారాలందిస్తానని తెలిపారు. వీసీ ఎల్.ఎస్.గణేశ్ మాట్లాడుతూ.. విద్యార్థులు సమయాన్ని వృథా చేయొద్దని గ్లోబల్ కాంపిటీషన్ను తట్టుకుని ఉన్నతంగా ఎదగాలంటే ప్రతిక్షణం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దేశానికి యువశక్తి బలమని పేర్కొంటూ నేర్చుకున్న జ్ఞానంతో సమాజానికి సేవలందించేలా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
జేఎన్టీయూహెచ్ వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల వార్షికోత్సవం సందర్భంగా ప్రతిఏటా నిర్వహిస్తున్న సాంకేతిక వేడుకలు (టెక్నికల్ ఫెస్ట్)ను ఆకట్టుకుంటున్నాయి. కళాశాలలో ఏడాదిపాటు.. పుస్తకాలతో కుస్తీపట్టి.. ప్రయోగశాలల్లో సాధించిన నైపుణ్యాలను, అంతర్గతంగా దాగిఉన్న ప్రతిభాపాటవాలను ప్రదర్శించేందుకు టెక్నికల్ ఫెస్ట్ చక్కటి వేదికగా మారుతున్నది. ఈ యేడాది టెక్ఫెస్ట్లో కళాశాలలోని ఇంజినీరింగ్ విభాగాలైన సివిల్ (స్తాపత్య), మెకానికల్ (కొనైజెన్స్ connaissanc), కంప్యూటర్ సైన్స్ (క్వెస్ట్), ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ (ప్రజ్ఞ), మెటలార్జికల్ (ఆయాస్), కెమికల్ (జీనోస్), ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ (స్ఫూర్తి), ఎంబీఏ (ఐదీప్) విద్యార్థులు భాగస్తులయ్యారు. విద్యార్థులే నాయకత్వ బాధ్యతలు తీసుకుని అధ్యాపకుల సలహాలతో సాంకేతిక ప్రదర్శనలు, పేపర్ ప్రెజెంటేషన్స్, క్విజ్, ఇతర ప్రతిభాపాటవాలను ప్రదర్శిస్తారు. కొత్తగా నేర్చుకున్న జ్ఞానాన్ని తోటి విద్యార్థులకు వివరిస్తారు. చివరగా ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థులు ఉత్సాహంగా వేడుకలో భాగస్తులవుతారు.
జేఎన్టీయూహెచ్ వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో టెక్ఫెస్ట్లో విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మొదటి రోజు సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ విద్యార్థులు వారికి సంబంధించిన అంశాలతో ప్రదర్శనలు నిర్వహించారు. ఆయా విభాగాల్లో విద్యార్థులు క్విజ్ పోటీలను, పేపర్ ప్రజెంటేషన్ పోటీలను నిర్వహించారు.