Hyderabad | సిటీబ్యూరో, మార్చి 1 (నమస్తే తెలంగాణ): జలమండలి ప్రాజెక్టు అధికారుల నిర్లక్ష్యం.. సివరేజీ పనులు చేపడుతున్న ఏజెన్సీ ధన దాహానికి ముగ్గురు అయాయక కూలీలు ప్రాణాలు వదిలారు. అసలే సీవర్ (మురుగునీటి పైపులైన్) పనులు..ఆపై కార్మికులతో పనిచేయించే సమయంలో సదరు ఏజెన్సీ రక్షణ చర్యలు తీసుకోవాల్సిన చోట ఏ మాత్రం నిబంధనలను పాటించలేదు . ఫలితంగా మిథేన్ గ్యాస్కి ముగ్గురు కూలీలు బలయ్యారు. నగరంలోని కుల్సుంపుర పోలీస్స్టేషన్ పరిధిలో జియాగూడ హనుమంతుడి ఆలయం సమీపంలో జలమండలికి సంబంధించిన సివరేజీ పైపులైన్ నిర్మాణ పనులు జరుగుతుండగా ఈ ఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. సదరు ఏజెన్సీ నిర్లక్ష్యం.. మూడు కుటుంబాల్లో విషాదం నింపింది.
పాతనగరంలోని నాలుగు నియోజకవవర్గాలు గోషామహల్, నాంపల్లి, కార్వాన్తో పాటు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో సీవరేజీ వ్యవస్థ ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. 33.50 చరదపు కిలోమీటర్ల విస్తీర్ణానికి సంబంధించి రూ.297 కోట్ల వ్యయంతో జోన్-3 సీవర్ నెట్వర్క్ ప్రాజెక్టులో 129.32 కిలోమీటర్ల పొడవైన పైపులైన్ నిర్మాణాన్ని జలమండలి చేపడుతున్నది. ఈ నిర్మాణ పనులను అయ్యప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కో చేపడుతున్నది. ఈ పనులు పూర్తి చేసుకొని చివరగా ప్రాజెక్టు ప్రారంభ దశలో ఉంది. ఈ సమయంలోనే పురాణాపూల్ నుంచి గోపీ హోటల్ వరకు భారీ సివర్ పైపులైన్ను జియాగూడ 100 ఫీట్ల రహదారి నుంచి హనుమంతుడి ఆలయం సమీపంలో జలమండలికి సంబంధించి ఐ అండ్ డీ వద్ద పైపులైన్ను కలిపే ప్రయత్నం చేస్తున్నారు.
పాత మ్యాన్హోల్కు కొత్త మ్యాన్హోల్కు సీవరేజీ అనుసంధానం చేసే క్రమంలో అప్పటికే ఉన్న గన్నీ బ్యాగులను తీసేందుకు ముగ్గురు కూలీలు 15 అడుగుల లోతు ఉన్న పైపులైన్ గుంతలోకి దిగారు. గన్నీ బ్యాగులు తీసే క్రమంలో తొలుత రాములు దిగి పనిచేస్తుండగా, అప్పటికే నిల్వ ఉన్న మురుగునీటి నుంచి వచ్చిన మిథేన్ గ్యాస్ బయటకు వచ్చింది. వెంటనే మరో ఇద్దరు శ్రీనివాసులు, హన్మంతులు రాములును కాపాడే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో మిథేన్ గ్యాస్తో ఊపిరిరాడక ముగ్గురు కూలీలు చనిపోయారు. సదరు పనులు చేసే కూలీలకు బ్యాక్టీరియా ఫ్రీ డ్రెస్సెస్’ పక్కాగా ఉండాలి.
హెడ్లైట్తో కూడిన హెల్మెట్, గమ్ బూట్లు, వాటర్ ఫ్రూఫ్ దుస్తులు, గ్లౌజులు, సురక్షిత బెల్టు, ఆక్సిజన్ మాస్క్, రసాయన క్యాథరేజ్ మాస్కు ఉండాలి. కానీ ఏజెన్సీ ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టని ఫలితంగా ముగ్గురు కూలీలు బలయ్యారు. కాగా, జలమండలి ప్రాజెక్టు అధికారులు సైతం నిర్లక్ష్యం వహించారు. సీవరేజీ పనులు జరిగేటప్పుడు అధికారుల పర్యవేక్షణ తప్పనిసరి. అయితే ఘటన తర్వాత కూడా అధికారులు స్పందించిన తీరు శూన్యం. ముగ్గురు కూలీలు చనిపోయి ..ఆ కుటుంబాలు న్యాయం కోసం కన్నీరు పెడుతున్నా..కనీసం ఘటనా స్థలికి సకాలంలో చేరుకోలేదు. పైగా సదరు ఏజెన్సీపై చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.