కొండాపూర్, జనవరి 27 : కాలుష్య నియంత్రణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నదని పరిశ్రమలు, ఐటీ శాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. శుక్రవారం రాయదుర్గం మెట్రో స్టేషన్లో ‘హైదరాబాద్ ఈ- మొబిలిటీ వీక్ మెట్రో ట్రైన్స్, పుష్పక్ బసెస్’ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫార్ములా వన్తో సమానంగా నిర్వహిస్తున్న ఫార్ములా -ఈ రేసింగ్కు దేశంలో మొదటి సారిగా హైదరాబాద్ నగరం వేదికగా నిలవడం సంతోషంగా ఉందన్నారు.
మంత్రి కేటీఆర్, మహీంద్ర రేసింగ్, గ్రీన్ కో సంస్థల సహకారంతో ఇది సాధ్యమైందన్నారు. రాష్ట్రంలో, దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్న విధానాలను వివరించేలా ఫిబ్రవరి 5 నుంచి 11వ తేదీ వరకు ‘హైదరాబాద్ మొబిలిటీ -వీక్’గా జరుపుకొంటున్నట్లు తెలిపారు. 5న పీపుల్స్ ప్లాజా నుంచి హైటెక్స్ వరకు, మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి హైటెక్స్ వరకు ఎలక్ట్రిక్ వాహనాలతో ముఖ్యంగా 30 మంది మహిళా ఆటోడ్రైవర్లతో ర్యాలీ ఉంటుందని చెప్పారు. డబుల్ డెక్కర్ బస్సులు సైతం ర్యాలీలో పాల్గొంటాయన్నారు. మంత్రి కేటీఆర్తో పాటు పలవురు ప్రముఖులు ఇందులో పాల్గొనున్నట్లు వివరించారు. ర్యాలీతో నగర వాసుల్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంపై అవగాహన కల్పిస్తామన్నారు. ఫిబ్రవరి 6న వివిధ దేశాలకు చెందిన ప్రముఖులు హెచ్ఐసీసీలో నిర్వహిస్తున్న గ్లోబల్ సదస్సులో పాల్గొని ఈ – వెహికల్స్పై తమ అనుభవాలను పంచుకొంటారన్నారు. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాజెక్ట్ ‘తెలంగాణ మొబిలిటీ వ్యాలీ’ని లాంఛనంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 7న ఔత్సాహికుల కోసం ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీలు, మొబిలిటీలపై టీ – హబ్లో స్టార్టప్ చాలెంజ్ను నిర్వహిస్తున్నారని, ఉత్తమంగా నిలిచిన స్టార్టప్లను ఎంపిక చేసి ప్రత్యేకంగా అభినందించనున్నట్లు పేర్కొన్నారు. ఫిబ్రవరి 8,9వ తేదీల్లో హైటెక్స్లో కొత్త కొత్త మోడల్స్లో మార్కెట్లోకి వస్తున్న ఎలక్ట్రిక్ కార్లు, బైక్, స్కూటర్స్, బస్సు, బ్యాటరీలతో షో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఫిబ్రవరి 10న నెక్లెస్ రోడ్లో ప్రాక్టీస్, క్వాలిఫికేషన్ రన్నింగ్లు, 11న ఈ – రేస్లు కొనసాగనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి, సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర పాల్గొన్నారు.