Sharada Vidyalaya | కేజీ నుంచి పీజీ వరకూ వేలాది మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తున్న శారదా విద్యాలయ శతాబ్ది ఉత్సవాలు ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ ఉత్సవాల్లో భాగంగా జరుగుతున్న వేడుకల్లో విశిష్ట వ్యక్తులు పాల్గొనడంతో పాటుగా ఈ విద్యాలయంతో తమకున్న అనుబంధాన్ని వివరిస్తూ విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపుతున్నారు. శనివారం జరిగిన వేడుకల్లో తెలంగాణ ఐటీ, పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, అడిషనల్ డీజీ, ఉమెన్ సేఫ్టీ వింగ్ హెడ్ శిఖా గోయల్తో పాటు సాక్షి కార్పోరేట్ ఎఫైర్స్ డైరెక్టర్ రాణిరెడ్డి అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శారదా విద్యాలయ వెబ్సైట్ను ఈ సందర్భంగా ప్రారంభించారు.
కార్యక్రమంలో శారదా విద్యాలయ ట్రస్టీ, సింథోకెమ్ ల్యాబ్స్ చైర్మన్ జయంత్ ఠాగోర్, శారదా విద్యాలయ సెక్రెటరీ రాం మాదిరెడ్డి, కరస్పాండెంట్ జ్యోత్స్న అంగారా పాల్గొన్నారు. పాఠశాలకు సంబంధించిన సమస్త సమాచారంతో పాటుగా బోధనా పద్ధతులు, అందించే కోర్సులు తదితర విషయాలను ఈ వెబ్సైట్లో పొందుపరిచారు. అంతకు ముందు క్రీడా మైదానాన్ని సైతం ప్రారంభించారు. దీనితో పాటుగా క్రికెట్ అభిమానుల కోసం ఐదు నెట్స్ను, బాస్కెట్బాల్, వాలీబాల్ కోర్టులు, అథ్లెటిక్స్, స్పోర్ట్స్ ఏర్పాట్లను సైతం అందుబాటులోకి తీసుకువచ్చారు.
నిరుపేద విద్యార్థులకు మరీ ముఖ్యంగా ఆడపిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలనే మహోన్నత సంకల్పంతో శారదా విద్యాలయ గ్రూప్ను 1922లో వై సత్యనారాయణ ఏర్పాటు చేశారు. ఈ విద్యాలయను అప్పటి హైదరాబాద్ నిజాం ప్రధానమంత్రితో పాటుగా భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ప్రారంభించారు. అత్యంత పురాతనమైన, లాభాపేక్షలేని విద్యాలయంగా ఖ్యాతి గడించిన శారదా విద్యాలయలో కేజీ నుంచి పీజీ వరకూ విద్యాబోధన సాగుతున్నది. దాదాపు 1,450 మంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. తొలుత బాలికల కోసమే దీన్ని ప్రారంభించినా.. అనంతర కాలంలో బాలురకు ఇక్కడ విద్యాబోధన చేస్తున్నారు. ప్రస్తుతం విద్యాసంస్థలో 62శాతం మంది బాలికలు ఉన్నారు.
నిరుపేద చిన్నారులకు విద్యనందించడంలో అందిస్తున్న తోడ్పాటుకుగాను 2018లో ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డును అందుకుంది. అవిశ్రాంతంగా వందేళ్లగా మెరుగైన విద్యాబోధనను పాతబస్తీ విద్యార్థులకు చేస్తోన్న శారదా విద్యాలయ విప్లవాత్మక ఆవిష్కరణలను చేస్తూ వస్తున్నది. డిజిటల్ తరగతులను నాల్గో తరగతి లోపు విద్యార్థులకు తీసుకురావడంతో పాటుగా 1.36 ఎకరాల విస్తీర్ణంలో ఆటస్థలాన్ని విద్యార్థులకు అందుబాటులో ఉంచి ఫిజికల్ ఎడ్యుకేషన్కు ప్రాధాన్యతం ఇస్తున్నది. శతాబ్ది ఉత్సవాలను ఘనంగా చేయడానికి శారదా విద్యాలయం ఏర్పాట్లు చేసింది. ఈ వేడుకల్లో భాగంగా వందేళ్ల విద్యాలయ ప్రస్థానంలో కీలకమైలురాళ్లతో ఓ ఫొటో గ్యాలరీని ఏర్పాటు చేసింది.