సికింద్రాబాద్, జనవరి 22:కంటోన్మెంట్ బోర్డుకు రూ.100 కోట్లు విడుదల చేయిస్తామని పాదయాత్ర సమయంలో ప్రజలను మభ్యపెట్టిన బండి సంజయ్ ఎక్కడున్నావంటూ కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు, బీఆర్ఎస్ సీనియర్ నేత జక్కుల మహేశ్వర్రెడ్డి ప్రశ్నించారు. కంటోన్మెంట్లో పాదయాత్ర చేసి 4 నెలలు గడుస్తున్నా ఒక్క రూపాయి కూడా బోర్డుకు నిధులను రప్పించలేకపోయారని విమర్శించారు. ఆదివారం బోయిన్పల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో బోర్డు మాజీ సభ్యులు లోక్నాథం, పాండుయాదవ్, ప్రభాకర్తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.
వారం రోజులుగా ఢిల్లీలో తిరిగిన రామకృష్ణ కంటోన్మెంట్కు చేరుకుని రూ.25కోట్లు కేంద్రం మంజూరు చేసిందని, దాంట్లో రూ. 10 కోట్లు బోర్డుకు జమ అవుతాయని మరోసారి ప్రజలను మభ్యపెట్టడం దిగజారు రాజకీయాలకు నిదర్శనమన్నారు. కంటోన్మెంట్ అభివృద్ధిపై చిత్తశుద్ధిలేని రామకృష్ణ బీఆర్ఎస్ నేతలపై ఇష్టారాజ్యంగా మాట్లాడితే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. జీహెచ్ఎంసీలో విలీనం చేస్తే 16 బజార్లను మాత్రమే కలపాలని మాట్లాడటం హేయమైన చర్య అన్నారు. దమ్ముంటే మిలటరీ స్థలానికి 10 మీట ర్ల దూరంలోనే విలీన ప్రక్రియ జరిగేవిధంగా చూడాలని రామకృష్ణను డిమాండ్ చేశారు. కంటోన్మెంట్ అభివృద్ధికి నోచుకోవాలనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ 2015లోనే హెచ్ఎండీఏ ద్వారా లేఖను కంటోన్మెంట్కు ఇచ్చినా స్పందించలేదని, 2016లో కూడా సెక్షన్ ఏ, బీల ద్వారా బోర్డు పరిధిని కలిపేందుకు యత్నించినా పట్టించుకోలేదన్నారు. ఆ సమయంలో బోర్డు ఉపాధ్యక్షుడిగా రామకృష్ణ ఉన్నా ఏం చేశావని నిలదీశారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మంత్రి, పార్టీ నేతలపై విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు.
త్వరలోనే కమ్యూనిటీ హాళ్ల పనులు వేగవంతం
కంటోన్మెంట్ పరిధిలోని బోయిన్పల్లి ప్రాంతంలో నిర్మించనున్న కమ్యూనిటీ హాళ్ల పనులు వేగవంతం కానున్నాయని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి చెప్పారు.
ఆదివారం బోర్డు సీఈఓ మధుకర్ నాయక్తో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించి మధ్యలోనే నిలిచిపోయిన పనులను పరిశీలించినట్లు తెలిపారు.
ప్రధానంగా బోయిన్పల్లి ధోబీఘాట్, పెన్షన్లైన్, చింతల్బస్తీ ప్రాంతంలో నిర్మిస్తున్న కమ్యూనిటీ హాళ్ల పనుల్లో జాప్యం ఏర్పడుతుందని, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా పూర్తి కావడంలేదని సీఈఓ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.
స్పందించిన సీఈఓ మధుకర్ నాయక్ ఇంజినీర్లతో కలిసి కాంట్రాక్టర్ను పిలిపించి పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ఆరో వార్డులోని రామన్నకుంట చెరువుకు సుచిత్ర నుంచి వచ్చే వరద కారణంగా కాలనీల ఇబ్బందులను సీఈఓకు తెలిపామని, అదేవిధంగా ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్డు నుంచి జీవీఆర్కు వెళ్లే దారిలో నాలాను వెడల్పు చేయాలని కోరినట్లు చెప్పారు.
ఏడో వార్డులోని లే అవుట్స్, ఆలయానికి వెళ్లే మార్గంలో నెలకొన్న వివాదాలపై చర్చించడం జరిగిందన్నారు. ఎంతో ఓపికగా ఆయా ప్రాంతాల్లో పర్యటించిన సీఈవోకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు.