ఖైరతాబాద్, సెప్టెంబర్ 20 : మా పార్టీలో సభ్యత్వం తీసుకోండి.. 200 గజాల ప్లాటు పట్టండి.. అంటూ సామాన్యులను ఆకర్షిస్తూ.. వారి వద్ద నుంచి డబ్బులు తీసుకుంటూ ఓ పార్టీ నాయకుడు ప్రజలను తన చుట్టు ప్రదక్షిణ చేయించుకుంటున్నాడు. గతేడాది సదరు నేతపై పోలీసులు కేసు నమోదు చేయగా, నాటి హామీ నెరవేర్చడంటూ రుసుము చెల్లించి సభ్యత్వం తీసుకున్న బాధితులు రోజూ ఆ పార్టీ కార్యాలయానికి బారులు తీరుతున్నారు. జై మహాభారత్ పార్టీ పేరుతో రవీంద్రభారతి పక్కనే ఓ పార్టీ కార్యాలయం వెలిసింది. ఆ పార్టీ వ్యవస్థాపకుడిగా ఉన్న భగవాన్ శ్రీ అనంత విష్ణు దేవ ప్రభు సామాన్యులకు గతేడాది ఓ బంపర్ ఆఫర్ను ప్రకటించాడు.
ఆధార్, రేషన్, ఓటర్ కార్డు కాపీలు తీసుకొచ్చి రూ.10 చెల్లించి సభ్యత్వం తీసుకుంటే ఒక్కొక్కరికీ రెండు వందల గజాల స్థలం ఇస్తానని నమ్మబలికాడు. స్వయంగా సమావేశం ఏర్పాటు చేసి ప్రకటన చేశాడు. దీంతో మహిళలు వందలాదిగా ఆ పార్టీ కార్యాలయానికి చేరుకొని, రుసుము చెల్లించి సభ్యత్వం తీసుకున్నారు. రోజుల తరబడి రవీంద్రభారతి నుంచి అసెంబ్లీ, ట్యాంక్బండ్ వైపు వెళ్లే రహదారులు జనంతో కిక్కిరిసిపోయి ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
పైగా అమలు కాని హామీ ఇచ్చి ప్రజలను ఆకర్షిస్తుండటంతో పోలీసులు వారిపై దృష్టి సారించారు. సదరు పార్టీ అధ్యక్షుడిపై గతేడాది జూలైలో చీటింగ్ కేసు సైతం నమోదు చేశారు. ఇక్కడ సీన్ కట్ చేస్తే.. వందలాదిగా సభ్యత్వాలు తీసుకున్న వారు ప్లాట్ల కోసం కండ్లలో వత్తులు వేసుకొని ఎదురు చూశారు. ఏడాది దాటినా ఇంకా ఎవరికీ సెంటు భూమి కూడా ఇవ్వకపోవడంతో నిలదీసేందుకు బారులు తీరారు. నిత్యం వందకు పైగా రవీంద్రభారతి రోడ్లోని ఆ పార్టీ కార్యాలయం పరిసరాల్లో వస్తుండటంతో మరో సారి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. బుధవారం కూడా వందలాదిగా మహిళలు తరలి వచ్చి ప్లాటు కోసం నిలదీసే ప్రయత్నం చేశారు. దీంతో కొంత స్వల్ప ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి తాత్కాలికంగా అక్కడున్న వారిని చెదరగొట్టారు. తమను మోసం చేసినట్లు బాధితులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని పోలీసులు చెబుతున్నారు.