ఉస్మానియా యూనివర్సిటీ, మే 31 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి పిడమర్తి రవికి లేదని తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్ డాక్టర్ బండారు వీరబాబు మండిపడ్డారు. స్థాయిని తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. ఉద్యమ నాయకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం నేడు యావత్ భారతదేశంలోనే అభివృద్ధి పథంలో ముందు వరుసలో ఉందని గుర్తు చేశారు. ఈ పదేళ్ల అభివృద్ధిని దశాబ్ది ఉత్సవాలను పండుగ వాతావరణంలో బ్రహ్మాండంగా నిర్వహించబోతున్నందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. స్వార్థపరులతో మరో స్వార్థపరుడైన పిడమర్తి రవి జత కలిసి తెలంగాణ ప్రభుత్వంపై లేనిపోని నిందారోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. నేను అడిగే ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పాలని సవాల్ చేశారు. సత్తుపల్లి నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యే టికెట్ కేటాయించింది బీఆర్ఎస్ పార్టీయేనని కొనియాడారు. కేబినెట్ హోదాతో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవిని రెండు సార్లు పిడమర్తి రవికి కట్టబెట్టింది కేసీఆరేనని చెప్పారు. ఇన్ని అవకాశాలు కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్లకు జీవితాంతం రుణపడి ఉండాలని సూచించారు. కానీ స్వార్థం కోసం ప్రభుత్వంపై లేనిపోని నిందారోపణలు చేస్తే విద్యార్థిలోకం సహించేది లేదని స్పష్టం చేశారు. దశాబ్ధి ఉత్సవాలను ఆయన బహిష్కరించడం కాదని, తెలంగాణ విద్యార్థి లోకం ఆయనను ఎప్పుడో బహిష్కరించిందని అన్నారు. ఆయనకు తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.