కవాడిగూడ, ఆగస్టు 28 : ఎస్సీ వర్గీకరణ అంశంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి తమ వైఖరి మార్చుకోవాలని, లేని పక్షంలో వచ్చే ఎన్నికల్లో మాలలు చిత్తుగా ఓడిస్తారని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ చెరుకు రాంచందర్ హెచ్చరించారు. సోమవారం మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో లోయర్ ట్యాంక్బండ్లోని అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేస్తూ కిషన్ రెడ్డి, రేవంత్రెడ్డిల ఫ్లెక్సీలను దహనం చేశారు. అనంతరం చెరుకు రాంచందర్ మాట్లాడుతూ ఉషా మహిళా కమిషన్, ఎస్సీ, ఎస్టీ జాతీయ కమిషన్తో పాటు సుప్రీంకోర్టు సైతం తన తీర్పులో ఎస్సీ వర్గీకరణ వీలుకాదని చెప్పిన అంశాన్ని గుర్తు చేశారు. వర్గీకరణ విషయంలో ఏడు రాష్ర్టాలు అనుకూలంగా, 13 రాష్ర్టాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు వ్యతిరేకంగా ఉన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఎన్నికల సమయంలో వర్గీకరణ పేరుతో షెడ్యూల్డ్ కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. షెడ్యూల్డ్ కులాల మీద కాంగ్రెస్, బీజేపీలకు ప్రేమ ఉంటే రిజర్వేషన్లు పొందని ఉప కులాలు, సంచార జాతులకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు ఎం.మల్లేశ్, కె.శ్రీనాథ్, చంద్రశేఖర్, ఎన్.నర్సింగరావు, కృష్ణ, సుజ్జి, జ్యోతి, పవిత్ర, లత, తదితరులు పాల్గొన్నారు.