సిటీబ్యూరో, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ) ;హెచ్ఐసీసీ వేదికగా తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బయో ఏషియా సదస్సు అధునాతన సాంకేతికతకు ఒక దిశను సూచిస్తున్నది. వివిధ వ్యాధుల నియంత్రణకు నూతన చికిత్సా విధానాలు, ఔషధాలను పరిచయం చేస్తున్నది. 76 వరకు ఏర్పాటైన స్టార్టప్లు.. బయోటెక్నాలజీలో కొత్త ఆవిష్కరణలకు నాంది పలికాయి. రెండు రోజులుగా వివిధ కళాశాలలకు చెందిన అధ్యాపక బృందం, విద్యార్థులు ఎగ్జిబిట్లను పరిశీలించి.. ఆవిష్కరణల ఉపయోగాలను తెలుసుకున్నారు. ఈ సదస్సు ద్వారా వైద్య, ఆరోగ్య రంగంలో అనేక కొత్త విషయాలను తెలుసుకోగలిగామన్నారు.
హైదరాబాద్ కేంద్రంగా అట్టహాసంగా జరుగుతున్న బయోఏషియా సదస్సులో మొత్తం 2వేలకు పైగా ప్రతినిధులు, 175 ఎగ్జిబిటర్లతో పాటు 76 స్టార్టప్లు కొలువుదీరాయి. అందులో ఉత్తమ ఆవిష్కరణలను గుర్తించేందుకు నిపుణులతో కసరత్తు చేసిన నిర్వాహకులు… 12 స్టార్టప్లను ఎంపిక చేసి.. చివరగా ఐదింటిని ఉత్తమ ప్రొడక్టులుగా గుర్తించారు. ఇందులో క్యాన్సర్ చికిత్సలో మెరుగైన వైద్యాన్ని అందించి ప్రాణాపాయాన్ని తప్పించే ఉత్పత్తులతోపాటు, వైకల్యంతో బాధపడే వారికి సాయపడే కృత్రిమ చేతులు కూడా ఉన్నాయి. ఎంపిక చేసిన 5 అంకురాలలో రెండు తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించడం విశేషం.
నిమిషాల్లో ఇన్ఫెక్షన్ గుర్తింపు
క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధి సోకినట్లుగా నిర్ధారించేందుకు జరిగే పరీక్షల ఫలితాలు కనీసం 5 నుంచి 6 రోజుల సమయం పడుతుంది. ఆ లోపు పేషంట్ ఆరోగ్యం చేజారిపోయే అవకాశం ఉంటుంది. అలా శరీరంలో వ్యాప్తి చెందుతున్న ఇన్ఫెక్షన్లను 90 నిమిషాల వ్యవధిలోనే గుర్తించేందుకు రూపొందించిన పరికరమే రామ్జా జినోసెన్సార్. ఐఐటీ ఢిల్లీకి చెందిన ఇన్నోవేటర్ ఈ పరికరాన్ని ఆవిష్కరించారు. తన తండ్రి క్యాన్సర్ వ్యాధి నిర్ధారణలో జరిగిన జాప్యం కారణంగానే చనిపోవడాన్ని తట్టుకోలేక ఇలాంటి సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఈ డివైజ్ను కనుగొన్నట్లుగా వ్యవస్థాపకురాలు డా. పూజా గోస్వామి వెల్లడించారు.
క్యాన్సర్కు మెరుగైన థెరపీ…
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న క్యాన్సర్ మహమ్మారిపై మెరుగైన చికిత్సలతో పోరాడేందుకు సాయపడే మందుల తయారీపై పనిచేసే స్టార్టప్ కంపెనీ సత్య ఆర్ఎక్స్ ఫార్మా ఇన్నోవేషన్. హైదరాబాద్ కేంద్రంగా నాచారంలోని ఇండస్ట్రీయల్ కారిడార్లో క్యాన్సర్ వ్యాధి నిర్మూలనకు ఈ సంస్థ పనిచేస్తున్నది. డ్రగ్స్ ఆవిష్కరణలో సత్తా చాటుతున్న ఈ కంపెనీ క్యాన్సర్ వ్యాధికి కీలమైన మందులను అభివృద్ధి చేసేందుకు పరిశోధనలు చేస్తున్నది. క్యాన్సర్ చికిత్సలో కలిగే డీఎన్ఏ డ్యామేజ్ను కట్టడి చేసేలా డ్రగ్ ఆవిష్కరణలపై ఫోకస్ చేసినట్లు కంపెనీ సీఈవో మూర్తి చావలి వివరించారు.
ఆరోగ్య నిర్వహణకు టెక్నాలజీ సొబగులు..
ఆరోగ్య నిర్వహణ, వైద్య రంగానికి మెరుగైన టెక్నాలజీని అందించడం కోసం తెలంగాణ గడ్డ మీద మొదలైన స్టార్టప్ ప్రతిభా హెల్త్కాన్. వైద్య, ఆరోగ్య రంగానికి టెక్నాలజీని జోడించిన వైద్య విధానాన్నే మార్చివేసేందుకు కృషి చేస్తున్నది. ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటళ్లలో విధులను సమర్థవంతంగా నిర్వర్తించేందుకు ఈ టెక్నాలజీ సాయపడుతుందని వ్యవస్థాపకులు డా. ప్రణయ్ గార్గ్ తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు
వినూత్న పరిశోధనలు చూడటం కొత్త అనుభూతినిచ్చింది. వాస్తవాలు కండ్లకు కట్టే ఎన్నో స్టార్టప్లను సదస్సులో ఏర్పాటు చేయడం.. వీటిని మేము సందర్శించడం నిజంగా వరం. నూతన సాంకేతికతలు,కొత్త స్టార్టప్లు రూపకల్పన చేసే వారికి ఎంతగానో దోహదపడతాయి. పరిశ్రమల్లో ఉపయోగించే అనేక సాధనాలతో పాటు రోబోటిక్ టెక్నాలజీలు, బయో ఇన్క్యుబేటర్లు, బయో ఎంటర్ప్రెన్యూర్ సౌకర్యాలకు సంబంధించి అనేక విషయాలను సదస్సు ద్వారా తెలుసుకోగలిగాం. విద్యార్థులకు ఇంత గొప్ప అవకాశాన్ని కల్పించిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
–రుతుజ, పీజీ స్టూడెంట్, బయోటెక్నాలజీ
కణాల తీరును బట్టి వ్యాక్సిన్ తయారీ…
ప్రాణాంతకమైన క్యాన్సర్ కణాలను గుర్తించడమే అత్యంత క్లిష్టమైనది. కాగా ట్యూమర్ కణాల జన్యు కణాల తీరును బట్టి వ్యాక్సిన్ అందించే ఆధునిక వైద్య విధానాన్ని అమెరికాకు చెందిన ల్యాంబ్డజెన్ థెరపాటిక్ కంపెనీ ఆవిష్కరించింది. ముఖ్యంగా బ్రెయిన్ ట్యూమర్ నియంత్రణకు ఈ వైద్యవిధానం సమర్థవంతంగా పనిచేస్తుందని కంపెనీ ప్రతినిధి ప్రవేశ్ గుప్తా అన్నారు.
చేయి కోల్పోయిన నాన్నను చూడలేక…
ప్రమాదంలో చేయి కోల్పోయిన నాన్నను చూడలేని ఓ కొడుకు మేథోమథనం నుంచి పుట్టినదే ఈ కృత్రిమ చేయి. ఢిల్లీ కేంద్రంగా ఈ ప్రొడక్టును ఆవిష్కరించగా ఆర్టిఫిషీయల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీతో పనిచేస్తుంది. చేయి కోల్పోయినవారు, పుట్టుకతో చేతులు పనిచేయని వారికి భుజ కండరాల కదలికల ఆధారంగా నిజమైన చేతుల మాదిరి పనిచేస్తుంది. ఎగ్జోబాట్ డైనమిక్ సంస్థ రూపొందించిన బయోనిక్ లింబ్స్ కృత్రిమ అవయవాల వినియోగంలో సంచలనంగా మారింది. వీటి ద్వారా అనుకోని పరిస్థితిల్లో వైకల్యంతో మదనపడేవారికి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని ఆవిష్కర్త మునీష్ కుమార్ వెల్లడించారు.
అధునాతన సాంకేతికతను తెలుసుకున్నాం
తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న బయో ఏషియా సదస్సు గొప్ప అనుభవాన్ని కల్పించింది. వ్యక్తి మూల కణాల ద్వారా స్వీయ కణజాలాన్ని పునరుత్పత్తి చేయడం, ఎముక మృదులాస్థిలో తిరిగి పెరగడం, సైటాక్సిసిటీ అధ్యయనాలు, ఫిష్ కణజాల నమూనాలు వంటి శాస్త్ర, సాంకేతిక, ఆరోగ్య సంరక్షణలో అధునాతన సాంకేతికత, అభివృద్ధిని ఈ సదస్సులో తెలుసుకోగలిగాం. విదేశీ, పారిశ్రామిక ప్రతినిధులతో చర్చించేందుకు అన్ని విద్యాసంస్థలకు ఇది ఒక మంచి అవకాశం.
– కవిత,(డిపార్ట్మెంట్ ఆఫ్ బయో టెక్నాలజీ హెడ్),ఏవీ కాలేజ్, హైదరాబాద్