బంజారాహిల్స్ : తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమైన సింగరేణి (Singareni) ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) అన్నారు. బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ఎన్బీటీనగర్లో నిర్మించతలపెట్టిన సింగరేణి అతిథి గృహానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్బాబుతో కలిసి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణికార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.
సింగరేణి బొగ్గు గనులు(Singareni Coal Mines) తెలంగాణ రాష్ట్రంతో పాటు పలు రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చడంతో పాటు సుమారు 45వేలమంది ఉద్యోగులతో అతిపెద్ద సంస్థగా ఉందన్నారు. ఇటీవల కొన్ని మైన్స్ మూతపడిన నేపథ్యంలో ఉత్పత్తిని పెంచడంతో కోసం తాడిచర్ల -2 బొగ్గుగనిని త్వరగా తెరిపించేందుకు కేంద్రమంత్రిని కలిసి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. పర్యావరణ అనుమతులను త్వరగా ఇచ్చేలా చూడాలని కేంద్ర బొగ్గుశాఖ మంత్రిని కలిశామన్నారు.
వెయ్యి గజాల స్థలంలో నిర్మించనున్న అతిథి గృహం పూర్తయితే సింగరేణి కాలరీస్కు సంబంధించి పనులమీద వచ్చే అధికారులకు సౌకర్యంగా ఉంటుందని సింగరేణీ సీఎండీ బలరాంనాయక్ అన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, గడ్డం వినోద్, మక్కన్సింగ్ రాజ్ ఠాకూర్, ప్రేమ్సాగర్ రావు తదితరులు పాల్గొన్నారు.