సిటీబ్యూరో, ఫిబ్రవరి 15(నమస్తే తెలంగాణ): రేషన్కార్డు కలిగి ఉన్న ప్రతీ ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే గృహజ్యోతి పథకం అమల్లోకి వచ్చి దాదాపు రెండేళ్లు కావచ్చింది. అయితే నగరంలో ఇప్పటికీ సగం మంది వినియోగదారులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తోంది. అర్హత కలిగిన ఇంకా సగం మందికి పైగా ఉచిత విద్యుత్ కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. దీనికి తోడు ఇటీవల ప్రభుత్వం కొత్త ఆహారభద్రత కార్డులను మంజూరుచేసింది. దీంతో వారంతా తమకెప్పుడు గృహజ్యోతి పథకం అందిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. సంక్రాంతి నేపథ్యంలో గృహజ్యోతి లబ్ధ్దిదారులను.. విద్యుత్ సిబ్బంది, అధికారులు నేరుగా కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేరుతో కూడిన సందేశ పత్రాలను అందజేశారు. అయితే ఉచిత విద్యుత్ పొందుతున్న వారు వాటిని స్వీకరించగా మిగిలినవారు విద్యుత్ సిబ్బందిని నిలదీస్తున్నారు. తమకు పథకం ఎప్పటినుంచి అమలుచేస్తారో అని సూటిగా ప్రశ్నిస్తున్నారు.
లబ్ధిదారుల సంఖ్య 11లక్షలే..
బల్దియా (హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల) పరిధిలో 10 విద్యుత్ సర్కిళ్లుండగా 11.39 లక్షల మంది లబ్ధ్దిదారులు ఉన్నారు. టీరేషన్ యాప్ అధికారిక లెక్కల ప్రకారం ఈ నాలుగు జిల్లాల్లో 25.03 లక్షల ఆహారభద్రత కార్డులున్నాయి. ఈ లెక్కన సిటీలో సగం మందికి కూడా గృహజ్యోతి పథకం వర్తించడం లేదు.
నగరంలో ప్రస్తుతం గృహజ్యోతి లబ్ధి పొందుతున్న వారిలో బంజారాహిల్స్లో అతి తక్కువగా 38,837 మంది ఉండగా, అత్యధికంగా సంగారెడ్డిలో 2,23,236 మంది ఉన్నారు. ఇక రాజేంద్రనగర్, హబ్సిగూడలో 1.4లక్షల మంది ఉండగా, హైదరాబాద్ సౌత్, సరూర్నగర్, మేడ్చల్లో సుమారు 1.35లక్షల మంది చొప్పున ఉన్నారు.
సైబర్సిటీ, సికింద్రాబాద్, హైదరాబాద్ సెంట్రల్లో 75వేల మంది చొప్పున ఉన్నారు. విద్యుత్ వినియోగం ఆధారంగా 0-50 యూనిట్ల వరకు యూనిట్కు రూ.1.95 పైసలు, 51-100 యూనిట్ల వరకు రూ.3.10 చొప్పున బిల్లు వసూలు చేస్తారు. వినియోగం 100 యూనిట్లకు పెరిగితే ప్రతీ యూనిట్కు రూ.3.40చొప్పున చెల్లించాలి. ప్రస్తుతం గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్ పొందుతున్న వారిలో 0-50, 50-100 యూనిట్లను వినియోగించే పేదలే ఎక్కువగా ఉన్నారు. వీరితో పాటు 100-200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించుకున్న లబ్దిదారులందరికీ జీరో బిల్ వస్తోంది. అంటే 200 యూనిట్లలోపు బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకవేళ 200 యూనిట్లు దాటి ఒక యూనిట్ పెరిగినా బిల్లు మొత్తానికే వస్తుంది. దీంతో వినియోగదారులు నిర్ణీత పరిధిలోనే కరెంట్ను వినియోగించుకోవాలి. వేసవికాలం నేపథ్యంలో ఈ బిల్లుల మోత మోగితే గృహజ్యోతి పథకం కోల్పోతామని ప్రస్తుత లబ్దిదారులు ఆందోళన చెందుతున్నారు.
కొత్తవారికి అవకాశం దక్కేనా..!
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొత్తలో పథకాల కోసం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న 18లక్షల మందిలో ఇప్పటికీ గృహజ్యోతికి ఎంపిక కానివారు నగరంలో సుమారుగా 7లక్షల మంది ఉన్నట్లు అధికారుల అంచనా. వారందరికీ తెల్ల రేషన్కార్డులుండగా కొన్నిచోట్ల అధికారులను, సిబ్బందిని మేనేజ్ చేసిన వారికే వచ్చాయని, మరికొన్ని చోట్ల అదనంగా తీసుకోవడం ఎందుకని, వారు భారంగా మారుతారని పక్కన పెట్టినట్లు పేద ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో గతంలో ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నవారిలో 60శాతం మందికే లబ్ది చేకూరగా మిగతావారిని ఎందుకు ఎంపిక చేయలేదనే ప్రశ్న ఎదురవుతోంది.
అయితే ఈసారి మళ్లీ తెల్లరేషన్ కార్డులు వచ్చి ప్రజాపాలనలో భాగంగా దరఖాస్తు చేసుకోవలసి వస్తే గతంలో రానివారితో పాటు కొత్తవారిని కలుపుకుని మరో 14లక్షల మంది లబ్ధ్దిదారులయ్యే అవకాశముంది. దీంతో ఈ పథకంలో కొత్తవారికి అవకాశం కల్పించాలా వద్దా అనే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నదని ఓ సీనియర్ విద్యుత్ ఇంజనీర్ చెప్పారు. ఇప్పటికే ఉచితాలతో తడిసి మోపెడవుతుండగా తాజాగా లబ్దిదారులు పెరిగితే మరింత భారమయ్యే అవకాశముందని, అంతేకాకుండా కొత్త డిస్కం వచ్చి ఈ భారం మోయాల్సి వస్తే అప్పుడేమైనా కొత్త లబ్ధ్దిదారులను తీసుకునే అవకాశముంటుందన్నారు. గతంలో ఉన్నవారి బిల్లులను ఓసారి పరిశీలించి వారి బిల్లుల యావరేజ్ ప్రకారం పథకానికి అర్హులా కాదా అనేది కూడా నిర్ణయించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా దక్షిణ డిస్కం అధికారులు అంటున్నారు. ఇదిలా ఉంటే జీహెచ్ఎంసీ కార్యాలయాల్లో ప్రజాపాలన పోర్టల్లో దరఖాస్తు చేసుకునే అవకాశముండగా.. నగరంలో మాత్రం పాతవాటిని ఎడిట్ చేయడం తప్ప కొత్తవాటిని తీసుకోవడం లేదని వినియోగదారులు అంటున్నారు.