హైదరాబాద్, జూన్ 11(నమస్తేతెలంగాణ): కరుడుగట్టిన గంజాయి డాన్ నీతుబాయ్ ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోవడంతో మత్తు లేడీని పట్టుకునేందుకు ఈగల్ టీమ్ బుధవారం నానక్రామ్గూడలో వాలింది. నీతును పట్టుకునేందుకు భారీ ఆపరేషన్ నిర్వహించింది. కానీ విషయాన్ని ముందుగానే తెలుసుకున్న గంజాయి డాన్ తన ఇంటి నుంచి పరారైంది. అయితే ఈగల్ ఫోర్స్ దాడులు జరిపే సమయానికి నిందితురాలి ఇంటి వద్ద గంజాయి కోసం మొత్తం 47మంది వినియోగదారులు క్యూ కట్టి ఉండడం, అందులో 20 మంది ఐటీ ఉద్యోగులు ఉండటం చూసి పోలీసులే నివ్వెరపోయారు.
వివరాల్లోకి వెళితే… ధూల్పేట ప్రాంతానికి చెందిన నీతుబాయ్ స్థానికంగా పోలీసుల నిఘా పెరగడంతో గచ్చిబౌలి ఠాణా పరిధిలోని నానక్రాంగూడలోకి తన మకాం మార్చింది. కిరాణం షాపు మాటున కుటుంబ సభ్యులతో కలిసి గంజాయి అమ్మకాలు మొదలు పెట్టింది. ఈక్రమంలో నిందితురాలిపై 2017 నుంచి 2024 వరకు ఎన్డీపీఎస్ చట్టం, ఎక్సైజ్ చట్టాల కింద 20 కేసులు నమోదయ్యాయి. పలుమార్లు అరెస్టయినా, జైలు శిక్ష అనుభవించినా, అక్రమ గంజాయి వ్యాపారాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. తాజాగా ఈగల్ టీమ్ జరిపిన దాడుల్లో తప్పించుకుని పారిపోయిన నిందితురాలి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, 2023 ఆగస్టులో నమోదైన భారీ గంజాయి కేసులో నితూ బాయి వద్ద నుంచి భారీ స్థాయిలో అక్రమ ఆస్తులను అధికారులు గుర్తించారు. ఆ కేసులో రూ.40.30 లక్షల నగదు, రూ.1.53 కోట్ల డిపాజిట్లు ఉన్న 16 బ్యాంకు ఖాతాలు, సుమారు రూ.2 కోట్ల విలువైన స్థిరాస్తులను ఎన్డీపీఎస్ చట్టం కింద జప్తు చేశారు. అయినప్పటికీ జైలు నుంచి విడుదలైన వెంటనే మళ్లీ గంజాయి విక్రయాలను ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.
2024 మార్చి 13న అప్పటి తెలంగాణ యాంటీ నారోటిక్స్ బ్యూరో (ప్రస్తుతం ఈగల్ ఫోర్స్) అధికారులు గచ్చిబౌలి పోలీసులతో కలిసి నానక్ రామ్ గూడలోని నితూ బాయి ఇంటిపై దాడి నిర్వహించారు. ఆ సమయంలో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి నుంచే గంజాయి విక్రయాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించి, 22.6 కిలోల గంజాయి, రూ.22.10 లక్షల నగదు, రెండు మొబైల్ ఫోన్లు, ఒక ఫోన్ పే సానర్ను స్వాధీనం చేసుకున్నారు. అప్పు డు జరిగిన దాడి సమయంలో నీతూ బాయి ఇంటి బయట గంజాయి కొనుగోలు చేసేందుకు సుమారు 30 మంది వినియోగదారులు క్యూ లో నిలబడి ఉండటం అధికారులను విస్మయానికి గురిచేసింది. 1970-80 దశకాల్లో రేషన్ దుకాణాల వద్ద కనిపించే క్యూలను తలపించేలా పరిస్థితి ఉందని అధికారులు తెలిపారు.
నితూ బాయి నిరంతరం నేరాలకు పాల్పడుతుండటంతో 2024 జూన్ 12న సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఆమెపై ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్ట్ ప్రయోగించారు. ‘డ్రగ్ ఆఫెండర్’గా గుర్తించి ఆమెను చంచల్ గూడ మహిళా ప్రత్యేక జైలుకు తరలించారు. అయితే 2024 అక్టోబర్ 17న తెలంగాణ హైకోర్టు పీడీ ఉత్తర్వులను రద్దు చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ, 2025 ఆగస్టు 22న సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పును సమర్థిస్తూ ప్రత్యేక అనుమతి పిటిషన్ను కొట్టివేసిన విషయం తెలిసిందే.