సిటీబ్యూరో, జూన్ 12 (నమస్తే తెలంగాణ): గంజాయి డాన్ నీతుబాయ్….ఈ మత్తు నెట్వర్క్ను ఛేదించేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. ఎక్సైజ్, లా అండ్ ఆర్డర్ పోలీసులు, ఈగల్ బృందాలు ఇన్ని వ్యవస్థలను దాటుకొని ఓ మహిళ నగరం నడిబొడ్డున యథేచ్ఛగా గంజాయి వ్యాపారం చేస్తుందడడంపై పలు రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రేషన్ షాపు తరహాలో నిత్యం పదుల సంఖ్యలో యువత నీతుబాయ్ ఇంటి ముందు క్యూ కట్టి మరీ గంజాయిని కొనుగోలు చేస్తుండటం గమనార్హం. నిందితురాలి వద్ద గంజాయి కొనుగోలు చేసేవారు ఏ దినసరి కూలీలో, కార్మికులో అనుకుంటే పొరపాటే. పెద్ద పెద్ద చదువులు వెలగబెట్టిన యువత, ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, వైద్య వృత్తిలో ఉన్నవారు, సినీ పరిశ్రమకు చెందిన వారు ఇలా చెప్పుకొంటూ పోతే చాలా రంగాలకు చెందిన వారికి నీతు తన మత్తు సేవలు అందిస్తున్నట్లు తెలుస్తోంది.
తొలుత ధూల్పేట కేంద్రంగా గంజాయి వ్యాపారాన్ని మొదలు పెట్టిన నీతు ఆ తరువాత తన వ్యాపారాన్ని గచ్చిబౌలిలోని నానక్రామ్గూడ ప్రాంతానికి మార్చింది. చట్టరీత్యా ఎన్ని చర్యలు తీసుకున్నా నిందితురాలి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోగా ఆమె మత్తు వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతోంది. నిందితురాలిపై 2017 నుంచి 2024 వరకు ఎన్డిపీఎస్, ఎక్సైజ్ చట్టాల కింద 20 కేసులు నమోదు చేసిన పోలీసులు, ఎక్సైజ్ అధికారులు, అప్పటి నార్కొటిక్ బ్యూరో పోలీసులు అనేకసార్లు జైలుకు పంపించారు. అంతేకాకుండా ఎన్ని కేసులు పెట్టినా, నిరంతరం నేరాలకు పాల్పడుతుండటంతో 2024 జూన్ 12న సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఆమెపై పీడీ యాక్ట్ ప్రయోగించిన విషయం తెలిసిందే.
2023లో గంజాయి విక్రయాల ద్వారా సంపాదించిన రూ.40.30 లక్షల నగదు, రూ.1.53 కోట్ల డిపాజిట్లు ఉన్న 16 బ్యాంకు ఖాతాలు, సుమారు రూ.2 కోట్ల విలువైన స్థిరాస్తులను ఎన్డీపీఎస్ చట్టం కింద జప్తు చేసిన విషయం తెలిసిందే. ఇంత చేసినా నీతుబాయ్ మాత్రం గంజాయి వ్యాపారాన్ని వదలడం లేదంటే దీని వెనకాల ఉన్న అదృశ్య శక్తి ఎవరనేది మిస్టరీగా మారింది. నీతుబాయ్ పోలీసుల కదలికలను ఎప్పటికప్పుడు పసిగట్టి తప్పించుకోవడమే కాకుండా తన వ్యాపారానికి అడ్డంకులు రాకుండా చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. నిందితురాలికి భారీ స్థాయి నెట్వర్క్ ఉందని, అది పోలీసు నెట్వర్క్కు ఏమాత్రం తీసిపోకుండా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఈగల్ బృందం దాడులకు సంబంధించిన సమాచారాన్ని ముందుగానే పసిగట్టిన నిందితురాలు తన నివాసం నుంచి పరారైంది.
చాలా పకడ్బందీగా ఆపరేషన్ నిర్వహించిన ఈగల్ రాకను నిందితురాలు ఎలా తెలుసుకోగలిగిందనేది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది. నిందితురాలికి పోలీసు వర్గాలతో ఏమైన సంబంధాలు ఉన్నాయా అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. నిందితురాలితో సన్నిహితంగా మెలిగే పోలీసులెవరైన దాడులకు సంబంధించిన ముందస్తు సమాచారం చేరవేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, 2024లో నిందితురాలిపై పీడీ చట్టం ప్రయోగించినప్పుడు దానిని కోర్టులో వీగిపోయేలా చేసి, పీడీ చట్టాన్ని రద్దు చేయించడంలో నిందితురాలి నెట్వర్క్లో ఉన్న పోలీసులు, న్యాయ నిపుణులే కీలకపాత్ర పోషించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈగల్ ఆపరేషన్లో నిందితురాలు తప్పించుకోవడం, నిందితురాలికి ముందస్తు సమాచారం ఎవరిచ్చారనే మిస్టరీపై పోలీసు, ఈగల్ వర్గాలు ఆరా తీస్తున్నట్లు సమాచారం.