సిటీబ్యూరో, మే 7 (నమస్తే తెలంగాణ): ఐటీ ఉద్యోగులు డ్రగ్స్కు బానిసలవుతున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూనే పార్ట్టైమ్గా డ్రగ్స్ వ్యాపారాన్ని చేస్తున్నారు. ఈ క్రమంలోనే బెంగుళూరు కేంద్రంగా నగరంలో డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతున్న ముగ్గురు సాఫ్ట్వేర్ ఉద్యోగులను ఎస్టీఎఫ్ టీమ్-బీ పోలీసులు పట్టుకుని అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 7.44గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఎస్టీఎఫ్ బీ-టీమ్ ఈఎస్ ప్రదీప్రావు వివరాల ప్రకారం..ఖమ్మం కు చెందిన అమ్జద్ సాఫ్ట్వేర్ ఇంజినీర్.
డ్రగ్స్కు అలవాటు పడి ఉద్యోగాన్నే మానేసి, డ్రగ్స్ వ్యాపారం మొదలు పెట్టాడు. బెంగుళూరులో రూ.2000లకు గ్రాము చొప్పున ఎండీఎంఏ డ్రగ్స్ను కొనుగోలు చేసి, నగరంలో గ్రాము రూ.8వేల నుంచి రూ.10వేలు చొప్పున విక్రయిస్తున్నాడు. తోటి ఐటీ ఉద్యోగులైన హేమంత్, హరీశ్ సైతం డ్రగ్స్కు బానిసై, అధిక సంపాదన కోసం ఐటీ ఉద్యోగాలు చేస్తూనే అమ్జద్ సహకారంతో డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతున్నారు. హయత్నగర్లోని హరీశ్ అనే మరో సాఫ్ట్వేర్ ఉద్యోగికి అందచేస్తుండగా సమాచారం అందుకున్న ఎస్టీఎఫ్ సీఐ భిక్షారెడ్డి, ఎస్ఐ బాలరాజు బృందం ముగ్గురు నిందితులను పట్టుకుని అరెస్టు చేశారు.