సిటీబ్యూరో, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): స్టాక్స్లో పెట్టుబడి పేరుతో మోసానికి గురైన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్..తనకు జరిగిన మోసంపై సైబర్ పోర్టల్లో ఫిర్యాదు చేసి… ఆ విషయాన్ని రెడిట్లో పోస్ట్ చేశాడు.. రెడిట్లో పోస్టు చూసిన సైబర్నేరగాళ్లు.. పోలీసులమని మీకు సహాయం చేస్తామంటూ నమ్మించి మరింత మోసం చేశారు. ఈ ఘటనపై బాధితుడు మల్కాజిగిరి సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యా ప్తు చేపట్టారు.. మల్కాజిగిరి జిల్లాకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన బాధితుడు సోషల్మీడియాలో బిట్ కాయిన్ ట్రేడింగ్ ప్రకటన చూసి హోడుల్హోడుల్.కామ్ ఫ్లాట్ ఫామ్లో చేరాడు. ఆ తరువాత తాము చెప్పినట్లు పెట్టుబడి పెట్టండంటూ నమ్మిస్తూ సైబర్ నేరగాళ్లు దఫ దఫాలుగా రూ. 9.28 లక్షలు వసూలు చేసి మోసం చేశారు. దీనిపై బాధితుడు సైబర్ పోర్టల్ 1931కు ఫిర్యాదు చేశాడు. ఈ విషయాన్ని రెడిట్లో పోస్టు చేశాడు.
రెడిట్లో పోస్టును చూసిన విశాల్ అనే ఓ వ్యక్తి( సైబర్ నేరగాడు) బాధితుడికి ఫోన్ చేశాడు. తాను కూడా మీలాగానే మోసపోయానని, తనకు కొందరు సహాయం చేశారంటూ నమ్మించాడు. మీకు ఈ విషయంలో నేను సహాయం చేస్తానని.. మీ కేసుకు సంబంధించిన విషయంలో దర్యాప్తు చేయించి డబ్బులు ఇప్పించేందుకు ప్రయత్నిస్తానంటూ నమ్మబలికాడు. ఈ క్రమంలోనే బాధితుడి జీమెయిల్ అకౌంట్ను ఓపెన్ చేశాడు. ఆ తరువాత నకిలీ పత్రాలతో మీ కేసు మూసేశారని, దర్యాప్తు దాదాపు పూర్తయ్యిందం టూ ఈ మెయిల్స్ పంపించారు. ఇంతలోనే రౌమ్య రంజన్ పాండా అనే పేరుతో ఓ వ్యక్తి పోలీసు అధికారినంటూ పరిచయం చేసుకొని.. ఎఫ్ఐఆర్, కోర్టు ఆర్డర్ కాపీలను చూపిస్తూ మీ డబ్బులు తిరిగి వచ్చేస్తాయని నమ్మించా డు. ఇందుకు కొంత ఖర్చవుతుందంటూ నమ్మిస్తూ దఫ దఫాలుగా డబ్బులు తీసుకోవడం ప్రారంభించారు. తన డబ్బులు వస్తాయనే ఆశతో నేరగాళ్లు అడిగినట్లు దఫ దఫాలుగా రూ. 44.19 లక్షల వరకు ఇస్తూ పోయాడు. అయితే ఇందులో రూ. 10 లక్షల వరకు బాధితుడికి తిరిగి ఇచ్చారు.. తాము ఏదో సహాయం చేస్తున్నామంటూ నటిస్తూ రూ. 34.48 లక్షలు మోసం చేశారు.