బంజారాహిల్స్, డిసెంబర్ 2: “మేము ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులం.. మీకు వచ్చిన పార్సిల్లో చట్ట వ్యతిరేకమైన వస్తువులు ఉన్నాయి” అంటూ ఓ ఐటీ ఉద్యోగిని నమ్మించిన నేరగాళ్లు డబ్బులు కాజేశారు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు ఇలా ఉన్నాయి.. అంబర్పేట సమీపంలోని నందనవనం కాలనీలో నివాసముంటున్న దివ్యావర్మ జూబ్లీహిల్స్లోని డీఈ షా సంస్థలో ఐటీ ఉద్యోగి. గత నెల 30న ఆమెకు గుర్తుతెలియని వ్యక్తి నుంచి పార్సిల్ రాగా తాను బుక్ చేయలేదంటూ తిరస్కరించింది. వెంటనే ఓ వ్యక్తి వాట్సాప్ కాల్ చేసి ముంబై క్రైం బ్రాంచ్ పోలీసు అధికారినంటూ పరిచయం చేసుకున్నాడు.
ఆ పార్సిల్లో చట్టవ్యతిరేక వస్తువులు ఉన్నాయని.. మనీ లాండరింగ్ వ్యవహారాల్లో సైతం ఆమె తలదూరుస్తున్నట్లు తెలుపడంతో తీవ్ర ఆందోళనకు గురైంది. ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని చెప్పినా వినకుండా ఈ కేసు విచారణ అధికారి ప్రకాశ్కుమార్ అని పేరు చెప్పి, అతడితో మాట్లాడించాడు. ఆధార్ కార్డు, కంపెనీ వివరాలు పంపమని కోరగా వాట్సాప్ ద్వారా పంపింది. కేసు విచారణ చేస్తున్నామని చెప్పి.. ఎలాంటి ఇబ్బందులు ఎదురు కావద్దంటే డబ్బు కావాలని కోరగా రూ.95,499 లు అతడికి పంపించింది. కాసేపటికి మరోసారి కాల్ చేసి మరిన్ని డబ్బులు అడగ్గా మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు తన బ్యాంక్ ఖాతాలను బ్లాక్ చేయించింది. శుక్రవారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఐపీసీ 420తో పాటు ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.