Hyderabad | సిటీబ్యూరో, మార్చి 22 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్లో వెస్ట్ జోన్ పరిధిలో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఐటీ కారిడార్లో అటు ఐటీ కంపెనీల కార్యకలాపాలు, నివాస ప్రాంతాలు పెద్ద ఎత్తున విస్తరించాయి. దీంతో ఈ ప్రాంతంలో ట్రాఫిక్ గణనీయంగా పెరిగింది. దానికి అనుగుణంగానే మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
ఐటీ కారిడార్లో ఉన్న రోడ్లను విస్తరించడంతో పాటు గచ్చిబౌలి నుంచి ప్రారంభమయ్యే ఔటర్ రింగు రోడ్డు సర్వీసు రోడ్లను విస్తరించే పనులను సుమారు రూ.300 కోట్లతో చేపట్టారు. ప్రసుత్తం ఈ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. గచ్చిబౌలి నుంచి ప్రారంభమయ్యే ఓఆర్ఆర్కు ఇరువైపులా ఉన్న ఫైనాన్సియల్ డిస్ట్రిక్, నానక్రాంగూడ, పుప్పాల్గూడ, మణికొండ, నార్సింగి, కోకాపేట వంటి ప్రాంతాలు ఉన్నాయి. ప్రస్తుతం రెండు లేన్లు ఉన్న సర్వీసు రోడ్లను 4 లేన్ల రహదారిగా మారుస్తున్నారు. ఇందుకోసం సుమారు రూ.300 కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నారు. నానక్రాంగూడ ఇంటర్చేంజ్ నుంచి ప్రారంభమై, శంషాబాద్ వెళ్లే మార్గంలో తెలంగాణ పోలీస్ అకాడమీ వరకు 7.5 కి.మీ, నార్సింగి నుంచి కొల్లూరు వరకు 12 కి.మీ మేర ఓఆర్ఆర్ సర్వీసు రోడ్ల విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దీంతో పాటే సోలార్ రూఫ్టాప్ సైకిల్ ట్రాక్ నిర్మాణం పనులు సైతం అదే వేగంగా జరుగుతున్నాయి.
ప్రస్తుతం ఐటీ కారిడార్లో భారీ బహుళ అంతస్థుల నిర్మాణాలన్నీ గచ్చిబౌలి నుంచి మొదలయ్యే ఓఆర్ఆర్కు ఇరువైపులా ఉన్నాయి. ఇవన్నీ పూర్తయి అక్కడ ఐటీ సంస్థల కార్యకలాపాలు, నివాస ప్రాంతాలు అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ రద్దీ ఒక్కసారిగా పెరిగి పోతున్న నేపథ్యంలో విస్తరణ పనులు ఈ ఏడాది ఆగస్టు నాటికి పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించామని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ అధికారులు తెలిపారు. సర్వీసు రోడ్లపై ట్రాఫిక్ రద్దీ పెరిగిన నేపథ్యంలో నానక్రాంగూడ ఓఆర్ఆర్ ఇంటర్చేంజ్ నుంచి నార్సింగి వెళ్లే మార్గంలో మై అవతార్ జంక్షన్ వరకు వన్ వే ట్రాఫిక్ విధానాన్ని అమలు చేస్తున్నారు.
నగరంలో అత్యంత ఎత్తయిన భవనాలు ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డును అనుకొని ఉన్న గచ్చిబౌలి ఫైనాన్సియల్ డిస్ట్రిక్ వైపు, నానక్రాంగూడ, నార్సింగి, మంచిరేవుల, కోకాపేట ప్రాంతాల్లోనే ఉన్నాయి. సుమారు 100కి పైగా భారీ బహుళ అంతస్థుల నిర్మాణాలు ఈ చుట్టు పక్కలే జరుగుతున్నాయి. దీంతో ఇక్కడికి నిర్మాణ సామగ్రితో వాహనాలు, అక్కడ పనిచేసేందుకు నిత్యం వచ్చే కార్మికులు, కొత్తగా నివాసాలు కొనుగోలు చేసిన వారితో పాటు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి వచ్చే ప్రజల వాహనాలతో సర్వీసు రోడ్లు ట్రాఫిక్తో నిండిపోతున్నాయి. కోకాపేట నుంచి కొల్లూరు దాకా, ఇటు నార్సింగి నుంచి శంషాబాద్ దాకా సర్వీసు రోడ్లపై రద్దీ గణనీయంగా పెరుగుతున్నది. ఈ మార్గాల్లో చేపట్టిన సర్వీసు రోడ్ల విస్తరణ పనులు ఇప్పటి వరకు సుమారు 75 శాతం పనులు పూర్తయ్యాయని, మరో 5 నెలల్లో ప్రతిపాదించిన ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ల విస్తరణ పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు.